Jagan: 1998 డీఎస్సీ అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు ఇవ్వాలి: సీఎం జగన్ ఆదేశాలు

  • విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష
  • పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం
  • గోరుముద్దలో నాణ్యతపై రాజీపడొద్దని స్పష్టీకరణ
  • అన్ని సబ్జెక్టులకు టీచర్లు ఉండేలా చూడాలని సూచన
CM Jagan review on education dept

ఏపీ సీఎం జగన్ విద్యా శాఖపై నేడు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది విద్యా కానుక కోసం ఏర్పాట్లు చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పిల్లలకు విద్యాకానుక అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. 1998 డీఎస్సీ అభ్యర్థులకు త్వరగా పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. 

'గోరుముద్ద' ఆహార నాణ్యతను నిరంతరం పరిశీలిస్తుండాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, అంగన్ వాడీలకు సార్టెక్స్, ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేయాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి పిల్లలకు రాగి మాల్ట్ ఇవ్వాలని, వారానికి మూడు రోజులు పిల్లలకు గ్లాసుడు రాగి మాల్ట్ ఇవ్వాలని, పిల్లల్లో ఐరన్, కాల్షియం ధాతువుల లోపాన్ని ఇది అరికడుతుందని అన్నారు. 

ఇక, పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండేలా చూసుకోవాలని, తద్వారా నాణ్యమైన బోధన అందించాలని సీఎం జగన్ పేర్కొన్నారు. స్కూళ్లలో పిల్లలందరి వద్ద డిక్షనరీలు ఉన్నాయో, లేదో పరిశీలించాలని ఆదేశించారు. పిల్లల వద్ద డిక్షనరీలు లేకపోతే అందించాలని చెప్పారు.

More Telugu News