కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- అగర్తల వెళ్తుండగా ఘటన
- ప్రతికూల వాతావరణం కారణంగా గువాహటిలో ల్యాండింగ్
- రాత్రికి అక్కడే రాడిసన్ బ్లూ హోటల్లో మంత్రి బస
- నేడు త్రిపుర చేరుకుని రథయాత్రను ప్రారంభించనున్న షా
గువాహటి విమానాశ్రయంలో అమిత్ షా విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని అమిత్ షా నేడు ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం కేంద్రమంత్రి గత రాత్రి అగర్తల చేరుకోవాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి వచ్చిన విమానం రాత్రి 10.45 గంటల సమయంలో గువాహటిలో ల్యాండ్ అయింది.
షా నేడు అగర్తలలో ‘జన బిశ్వాస్ రథ యాత్ర’ ప్రారంభిస్తారు. అనంతరం ధర్మనగర్లో బహిరంగ సభలో మాట్లాడతారు. అక్కడే మధ్యాహ్నం ఓ కార్యకర్త ఇంట్లో భోజనం చేస్తారు. ఆ తర్వాత దక్షిణ త్రిపురలోని సబ్రూమ్కు వెళ్తారు.