Uttar Pradesh: యూపీలోనూ ఢిల్లీ లాంటి ఘటన.. స్కూటీపై వెళుతున్న మహిళను ఢీకొట్టి మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్!

  • బాండాలోని మావై బుజుర్గ్ గ్రామంలో ఘటన
  • వైరల్ అవుతున్న వీడియోలు
  • ట్రక్ డ్రైవర్ కోసం పోలీసుల గాలింపు
Truck rams into woman on scooty and drags her for 3 km in UPs Banda

ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగానే ఉత్తరప్రదేశ్‌లోని బాండాలో అలాంటి ఘటనే మరొకటి జరిగింది. స్కూటీపై వెళ్తున్న ఓ మహిళను ట్రక్కు ఢీకొట్టి ఆమెను మూడు కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జిల్లాలోని మావై బజుర్గ్ గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళను ఢీకొట్టిన ట్రక్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 

కాగా, ఢిల్లీ‌లో జనవరి ఒకటిన తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న 20 ఏళ్ల అంజలిని ఢీకొట్టిన కారు.. ఆమెను దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆమె మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తూ సంచలనమవుతోంది.

More Telugu News