Anjali: ఢిల్లీ కారు ప్రమాద ఘటనలో వెలుగులోకి విస్తుపోయే విషయాలు!

  • ప్రమాద సమయంలో అంజలి మద్యం తాగి ఉందన్న ఆరోపణలను కొట్టిపడేసిన ఫ్యామిలీ డాక్టర్
  • అదే నిజమైతే పోస్టుమార్టం రిపోర్టులో ఆ విషయం వెల్లడై ఉండేదని స్పష్టీకరణ
  • ప్రమాదానికి కొన్ని గంటల ముందే అంజలి స్నేహితురాలు ఇంటికి చేరి ఉండొచ్చని అనుమానం
Shocking Facts coming in Delhi Car Accident

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కారు ప్రమాద ఘటనకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. అయినప్పటికీ ఏ విషయమూ నమ్మశక్యంగా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలు అంజలి స్కూటర్ డ్రైవ్ చేస్తున్న సమయంలో మద్యం తాగి ఉందన్న ఆరోపణలను ఆమె ఫ్యామిలీ డాక్టర్ తోసిపుచ్చారు. ప్రమాద సమయంలో అంజలితోనే ఉన్న ఆమె స్నేహితురాలు మీడియాతో  మాట్లాడుతూ.. పార్టీ అనంతరం మద్యం తాగినప్పటికీ అంజలి స్కూటీ నడిపిందని, తాను వద్దని చెప్పినా వినలేదని పేర్కొంది. 

అయితే, ఈ ఆరోపణలను అంజలి ఫ్యామిలీ డాక్టర్ కొట్టిపడేశారు. ఆమె పోస్టుమార్టం రిపోర్టులో అలాంటి ఆనవాళ్లేమీ కనిపించలేదన్నారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. అంజలి పొట్టలో ఆహారం ఉందని, ఆమె కనుక నిజంగానే మద్యం తాగి ఉంటే ఇతర రసాయనాలు కూడా ఉన్నాయని వైద్యులు ఆ నివేదికలో పేర్కొని ఉండేవారన్నారు. నిజానికి అంజలిది మామూలు హత్య కాదని, ఆమె శరీరంపై 40 గాయాలు ఉన్నట్టు పోస్టుమార్టంలో వెల్లడైందని అన్నారు. 

తాజాగా బయటకు వచ్చిన సీసీటీవీ దృశ్యాలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ దృశ్యాలను బట్టి ప్రమాద సమయంలో అంజలి స్నేహితురాలు అక్కడ ఉండకపోవచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందే ఆమె ఇంటికి వచ్చినట్టు రికార్డులను బట్టి తెలుస్తోంది. ఆమె కూడా మద్యం తాగి ఉన్నట్టు సమాచారం. జనవరి 1న తెల్లవారుజామున స్కూటర్‌ను ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌ను నడుపుతున్న అంజలి కారు కింద చిక్కుకుపోయింది. ఇదేమీ గమనించని కారులోని వారు కారును అలాగే పోనిచ్చారు. దాదాపు 12 కిలోమీటర్ల మేర అంజలిని ఈడ్చుకుపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన అంజలి ప్రాణాలు కోల్పోయింది.

More Telugu News