శ్రీలంకపై 5 వికెట్లకు 162 రన్స్ చేసిన టీమిండియా
- ముంబయి వాంఖెడే మైదానంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
- మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్
- ఆఖర్లో విజృంభించిన దీపక్ హుడా, అక్షర్ పటేల్
కెప్టెన్ హార్దిక్ పాండ్య 29, ఓపెనర్ ఇషాన్ కిషన్ 37 పరుగులు చేశారు. ఇషాన్ కిషన్ దూకుడు చూస్తే భారత భారీ స్కోరుపై కన్నేసినట్టు కనిపించింది. అయితే లంక స్పిన్నర్లు భారత్ దూకుడును అడ్డుకున్నారు. దాంతో 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది.
శుభ్ మాన్ గిల్ 7, సూర్యకుమార్ యాదవ్ 7, సంజు శాంసన్ 5 పరుగులకే అవుటై నిరాశపరిచారు. ఈ దశలో ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ అవుటయ్యాక, ఆ బాధ్యతను హుడా, అక్షర్ పటేల్ స్వీకరించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఆఖర్లో బ్యాట్లు ఝుళిపించి భారత్ స్కోరును 150 మార్కు దాటించారు. లంక బౌలర్లలో తీక్షణ, మధుశంక, చామిక కరుణరత్నే, ధనంజయ డిసిల్వా, హసరంగ తలో వికెట్ తీశారు.