Revanth Reddy: ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతులు ఇంకెవరికి చెప్పుకోవాలి?: సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ

  • మద్దతు ధర దక్కకుండా దళారులు మోసం చేస్తున్నారన్న రేవంత్
  • ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శలు
  • రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వం నుంచి స్పందనలేదని ఆరోపణ
Revanth Reddy shot a letter to CM KCR over farmers issues

తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రైతులు ఎంతో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే, వారు ఇంకెవరికి చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. 

రైతులకు మద్దతుధర దక్కకుండా దళారులు మోసం చేస్తున్నారని, రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కితే ప్రభుత్వం నుంచి స్పందన కరవైందని తెలిపారు. 

పత్తి క్వింటాలుకు రూ.6 వేల నుంచి రూ.7 వేలు మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, కనీసం రూ.15 వేలు రాకుంటే గిట్టుబాటు కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రోజుకు ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, జాతీయస్థాయిలో రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగోస్థానంలో ఉందని నేషనల్ క్రైమ్ బ్యూరో చెబుతోందని వివరించారు. రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో రైతులు సంక్షోభంలో చిక్కుకున్నారని రేవంత్ విమర్శించారు.

More Telugu News