apsrtc: ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరపై రాయితీ

  • ఒకేసారి నాలుగు టికెట్లు కొంటే 5 శాతం తగ్గిస్తామన్న ఏపీఎస్ ఆర్టీసీ
  • ముందే బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణం చార్జీలపై 10 శాతం తగ్గింపు
  • పండుగ వేళ ప్రైవేటు ఆపరేటర్ల నుంచి పోటీని తట్టుకోవడానికేనన్న అధికారులు 
  • ఇప్పటికే వృద్ధులకు 25 శాతం రాయితీ ఇస్తున్న ఆర్టీసీ
apsrtc special offer on sankranthi special buses ticket prices

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకేసారి నలుగురికి (పిల్లలు సహా) టికెట్లు కొంటే ఛార్జీలపై 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరుగు ప్రయాణానికి కూడా ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకుంటే ఆ టికెట్ల ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. పండుగ కోసం హైదరాబాద్ సహా వివిధ నగరాల నుంచి సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. ఈ సందర్భంగా రద్దీ పెరగడంతో ప్రైవేటు బస్ ఆపరేటర్లు టికెట్ రేట్లను ఇష్టానుసారంగా పెంచి, ప్రయాణికులను దోచేస్తుంటారు. దీనికి చెక్ పెట్టడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ, లాభాలను ఆర్జించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.

పండుగ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేకంగా బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు 6,400 స్పెషల్ బస్సులను తిప్పుతామని వివరించారు. ఈ స్పెషల్ బస్సులలో కూడా సాధారణ బస్సుల ఛార్జీలు వసూలు చేయడంతో పాటు అదనంగా రాయితీని అమలు చేయనున్నట్లు తెలిపారు. 

ఇప్పటికే వృద్ధులకు టికెట్ ధరపై 25 శాతం రాయితీ ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తుచేశారు. కుటుంబం సహా సొంతూరుకు వెళ్లే వారు తాజాగా ప్రకటించిన రాయితీతో తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చని చెప్పారు. కాగా, ఈ-వాలెట్ ద్వారా చేసుకునే టికెట్ బుకింగ్ లకూ రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

More Telugu News