ప్రియురాలితో కలిసి పారిపోయేందుకు వృద్ధుడి ప్లాన్.. వేరే వ్యక్తిని చంపి తనదిగా నమ్మించే యత్నం!

farmer kills labourer to stage his own murder
  • మహారాష్ట్రలోని ఖేడ్ జిల్లాలో ఘటన
  • మహిళతో వివాహేతర సంబంధం కొనసాాగిస్తున్న సుభాష్
  • ఆమెతో కలిసి పారిపోయేందుకు ప్లాన్
  • వ్యక్తిని చంపి తల వేరు చేసి తన దుస్తులు తొడిగి పొలంలో పడేసిన నిందితుడు
  • సీసీటీవీ ఆధారంగా సుభాషే హంతకుడని తేల్చిన పోలీసులు
ప్రియురాలితో కలిసి పారిపోవాలనుకున్న ఓ వృద్ధుడు.. అందుకోసం మరో వ్యక్తిని బలితీసుకున్నాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ఖేడ్ జిల్లాకు చెందిన సుభాష్ అలియాస్ కర్బా చబన్ థోర్వ్ (65)కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. విషయం బయటపడకుండా ఉండేందుకు ఆమెతో కలిసి ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకున్నాడు. 

ప్లాన్‌లో భాగంగా 45 ఏళ్ల రవీంద్ర భీమాజీ ఘోనంద్ అనే వ్యక్తిని ఈ నెల 16న హతమార్చి తలను వేరు చేశాడు. అనంతరం ఆ మొండేనికి సుభాష్ తన దుస్తులు తొడిగి దానిని తీసుకెళ్లి తన పొలంలో పడేశాడు. ఆ మృతదేహాన్ని చూసిన వారు తానే చనిపోయినట్టు భావిస్తారని, తద్వారా తాము పారిపోయిన విషయాన్ని ఎవరూ గుర్తించలేరని భావించాడు. 

మరోవైపు, తల లేని మొండేన్ని చూసిన సుభాష్ కుటుంబ సభ్యులు దుస్తుల ఆధారంగా చనిపోయింది ఆయనేనని భావించి అంత్యక్రియలు కూడా చేసేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయింది సుభాష్ కాదని, రవీంద్ర భీమాజీ అని గుర్తించారు. సుభాషే హంతకుడని గుర్తించిన పోలీసులు సోమవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రవీంద్రను తానే హత్య చేసినట్టు సుభాష్ అంగీకరించాడు.
Advertisement
Maharashtra
Khed
Crime News

More Telugu News