New Delhi: ఢిల్లీలో ఘోరం.. బైక్‌పై వచ్చి బాలికపై యాసిడ్ పోసి పరారైన యువకులు.. వీడియో ఇదిగో!

  • ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఘటన
  • నిందితుల్లో ఒకడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బాధితురాలికి న్యాయం చేస్తామన్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్
Bike borne men throw acid at 17 year old in Delhi

ఢిల్లీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ చల్లి పరారయ్యారు. దాడిలో గాయపడిన బాధిత బాలిక ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఢిల్లీలోని మోహన్ గార్డెన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. ఉదయం 7.30 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బాలికపై యాసిడ్ పోసి పరారయ్యారు.  

ఈ ఘటనకు సంబంధించి 9 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూముకు సమాచారం అందినట్టు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో బాధిత బాలిక తన చెల్లెలితో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. యాసిడ్ దాడి ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్ స్పందించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News