Mallu Bhatti Vikramarka: పీసీసీ కమిటీలపై నాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో తెలియదు: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka opines on PCC Committees
  • ఇటీవల తెలంగాణ పీసీసీ కమిటీల ప్రకటన
  • తనను సంప్రదించలేదన్న భట్టి
  • పీసీసీతో పాటు సీఎల్పీకి కూడా బాధ్యత ఉంటుందని వ్యాఖ్య 
  • భట్టి నివాసంలో సీనియర్ నేతల భేటీ
ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పీసీసీ కమిటీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలపై తెలంగాణలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా, తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు.  

పీసీసీ కమిటీల్లో సీనియర్ల పేర్లు లేవని, సామాజిక సమతుల్యత లోపించిందని కొందరు తనతో చెప్పారని భట్టి వెల్లడించారు. తన దృష్టికి వచ్చిన అంశాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. పీసీసీ కమిటీల రూపకల్పనలో సీఎల్పీ అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారని, కానీ తనకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదో తెలియదని అన్నారు. జిల్లాల వారీగా నేతల ఎంపికలో పీసీసీతో పాటు సీఎల్పీకి కూడా సమాన బాధ్యత ఉంటుందని భట్టి పేర్కొన్నారు. 

భట్టి విక్రమార్క నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, కోదండరెడ్డి, గీతారెడ్డి, మధుయాష్కీ గౌడ్, మహేశ్వర్ రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలతో పాటు పీసీసీ కమిటీలపైనా ఈ భేటీలో చర్చించామని భట్టి వెల్లడించారు.

More Telugu News

Mallu Bhatti Vikramarka
PCC Committees
Congress
Telangana