Bengaluru: రాత్రి 11 తర్వాత బయటకొచ్చారని రూ. వెయ్యి జరిమానా.. ఎక్కడంటే!

  • ఓ జంటకు ఫైన్ వేసిన బెంగళూరు పోలీసుల నిర్వాకం
  • న్యాయం చేయాలంటూ బెంగళూరు కమిషనర్ కు బాధితుడి ట్వీట్
  • ఘటనపై విచారణకు ఆదేశించిన సిటీ కమిషనర్
Bengaluru Couple Fined For Being Out After 11 PM

అర్ధరాత్రి పూట రోడ్డు మీదికి వచ్చినందుకు రూ.3 వేలు జరిమానా కడతారా.. లేక రూ.వెయ్యి ఇచ్చి గప్ చుప్ గా ఇంటికెళ్లిపోతారా అంటూ ఓ యువజంటను నడిరోడ్డుపై పోలీసులు ఆపేశారు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లొస్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. డబ్బు కట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు. ఎంత బతిమిలాడినా వినకపోవడంతో గత్యంతరం లేక రూ.వెయ్యి లంచం ఇచ్చి వెళ్లిపోయారా భార్యాభర్తలు. 

బెంగళూరులో ఈ నెల 8న జరిగిందీ ఘటన.. దీనిపై తాజాగా బాధితుడు సిటీ పోలీస్ కమిషనర్ కు ట్విట్టర్ లో మొరపెట్టుకోవడంతో వివరాలు బయటకువచ్చాయి. బెంగళూరులోని మాన్యతా పార్క్ ఏరియాలో ఈ నెల 8న అర్ధరాత్రి భార్యాభర్తలు ఇద్దరూ ఓ ఫ్రెండ్ ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకలకు హాజరై తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళుతున్నారు. ఇంతలో ఓ పోలీస్ వాహనం వచ్చి వారి దగ్గర ఆగింది. 

అందులో నుంచి దిగిన ఇద్దరు పోలీసులు వీళ్ల ఐడీ కార్డులు చూపాలని అడిగారు. మొబైల్ లో చూపించిన ఆధార్ ఫొటోలను చూసి, మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై వ్యక్తిగత వివరాలకు సంబంధించి ఒక పోలీస్ ప్రశ్నలు అడుగుతుంటే, మరో ఆఫీసర్ చలానా రాయడం మొదలుపెట్టాడు. చలానా ఎందుకని అడిగితే.. రాత్రి 11 తర్వాత రోడ్లపైకి రావడం నేరమని రూల్ ఉందని దబాయించాడు. ఈ తప్పు చేసినందుకు రూ.3 వేలు కట్టాలని రశీదు చేతిలో పెట్టాడు.

ఈ రూల్ గురించి తమకు తెలియదని, తమను వదిలిపెట్టాలని భార్యాభర్తలు ఇద్దరూ వేడుకున్నా వినిపించుకోలేదు. జరిమానా కట్టకుంటే ఇద్దరినీ అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లాల్సి ఉంటుందని బెదిరింపులకు దిగారు. ఆ ఇద్దరు పోలీసులలో ఒకరు తనను పక్కకు పిలిచి రూ. వెయ్యి ఇచ్చేసి వెళ్లిపొమ్మని, సమస్యను పెద్దగా చేసుకోవద్దని బెదిరించాడని బాధితుడు చెప్పాడు.

గత్యంతరం లేక పేటీయం ద్వారా రూ.వెయ్యి ట్రాన్స్ ఫర్ చేసి తన భార్యతో కలిసి ఇంటికి వెళ్లిపోయానని బాధితుడు వివరించాడు. తను ఎదుర్కొన్న ఇబ్బందిని పేర్కొంటూ బెంగళూరు సిటీ కమిషనర్ కు మరుసటి రోజు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నాడు. జరిగిన సంఘటనను 15 ట్వీట్లలో వెల్లడించాడు. 

మాన్యతా పార్క్ కు చెందిన కార్తిక్ పాత్రికి ఎదురైందీ అనుభవం. పాత్రి ట్వీట్ పై స్పందించిన కమిషనర్.. జరిగిన సంఘటనపై విచారణ జరిపి, ఆ పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాత్రికి జవాబిచ్చారు. ఇప్పటికే విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ధైర్యంగా సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినందుకు పాత్రిని మెచ్చుకున్నారు. ఇలాంటి అనుభవం ఎవరు ఎదుర్కొన్నా సరే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని బెంగళూరు సిటీ డిప్యూటీ కమిషనర్ అనూప్ ఏ షెట్టి సూచించారు.

More Telugu News