కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు
- రెండు వాహనాల్లో వచ్చిన ఎనిమిది మంది బృందం
- లిక్కర్ కేసులో ఎమ్మెల్సీని విచారించనున్న అధికారులు
- కవిత అడ్వొకేట్ బృందం సమక్షంలో జరగనున్న విచారణ
సీబీఐ విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత అడ్వొకేట్లు ఉదయమే ఆమె ఇంటికి వెళ్లారు. పదకొండు గంటలకు విచారణ మొదలుకానున్న నేపథ్యంలో పదిన్నరకే అడ్వొకేట్ల టీమ్ కవిత ఇంటికి చేరుకుంది. కవిత అడ్వొకేట్ల సమక్షంలోనే సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత దగ్గర ఏదైనా సమాచారం ఉందా అని తెలుసుకోవడానికి అధికారులు ఆమెను విచారిస్తున్నట్లు సమాచారం. కాగా, సీబీఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటిముందు రాత్రికిరాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. ‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్’ అంటూ పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.