Mypadu Beach: నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ లో 50 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం

  • బంగాళాఖాతంలో మాండూస్ తుపాను
  • తీరానికి సమీపిస్తున్న వైనం
  • ఏపీపై పెరుగుతున్న ప్రభావం
  • మైపాడు బీచ్ లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు
Sea comes forth in Mypadu beach

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను తీరానికి చేరువగా వస్తున్న కొద్దీ ఏపీపై దాని ప్రభావం పెరుగుతోంది. నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇక్కడ సముద్రం 50 మీటర్లు ముందుకు వచ్చింది. 

తుపాను ప్రభావంతో గాలుల తీవ్రత కూడా పెరుగుతుండడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అలల ఉద్ధృతి, గాలుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో మైపాడు బీచ్ కు పర్యాటకులు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ మధ్యాహ్నం నుంచి  నెల్లూరు జిల్లా తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 

అటు, రాయలసీమకు కూడా అతి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కడప జిల్లాలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసింది. కడప, బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగులో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. జిల్లాలోని నదులు, చెరువులు, కాలువల పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 

మాండూస్ తుపాను ప్రభావంతో అన్నమయ్య జిల్లాలోనూ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. రెండ్రోజులు భారీ వర్షాలు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.

More Telugu News