Team India: తమ బిజినెస్ క్లాస్ సీట్లను పేసర్లకు ఇచ్చేసిన ద్రావిడ్, రోహిత్, కోహ్లీ... ఎందుకంటే...!

  • ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్ కప్
  • వివిధ నగరాల్లో మ్యాచ్ లు
  • ప్రయాణించేటప్పుడు ప్రతి జట్టుకు 4 బిజినెస్ క్లాస్ సీట్లు
  • సుఖప్రయాణానికి వీలు కల్పించే బిజినెస్ క్లాస్ సీట్లు
Team India big heads given their business class tickets to pacers

రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు సిద్ధమవుతోంది. కాగా, జట్టులోని పేసర్లను మరింత తాజాగా ఉంచేందుకు టీమ్ మేనేజ్ మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. 

వరల్డ్ కప్ సందర్భంగా ఒక నగరం నుంచి మరో నగరానికి ప్రయాణించేటప్పుడు ప్రతి జట్టుకు నాలుగు బిజినెస్ క్లాస్ టికెట్లు కేటాయిస్తారు. కెప్టెన్, వైస్ కెప్టెన్, కోచ్, మేనేజర్ లేదా ఎవరైనా కీలక ఆటగాళ్లు బిజినెస్ క్లాస్ లో ప్రయాణించే వీలుంటుంది. ఆ లెక్కన టీమిండియాకు కూడా నాలుగు బిజినెస్ క్లాస్ సీట్లు కేటాయించారు. 

అయితే టీమిండియా వ్యూహకర్తలు తమ బిజినెస్ క్లాస్ సీట్లను పేసర్ల కోసం త్యాగం చేశారు. పలు సందర్భాల్లో ద్రావిడ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమకు కేటాయించిన బిజినెస్ క్లాస్ సీట్లను పేస్ బౌలర్లు మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాకు ఇచ్చేశారు. 

బిజినెస్ క్లాస్ సీట్లలో సుఖవంతమైన ప్రయాణం చేసే వీలుంటుంది. పెద్ద సీట్లు, అనేక సౌకర్యాలతో కూడిన బిజినెస్ క్లాస్ సీట్లలో విశ్రాంతిగా కూర్చునే వెసులుబాటు ఉంటుంది. తద్వారా పేస్ బౌలర్లు ప్రయాణ బడలిక లేకుండా మ్యాచ్ జరిగే నగరానికి చేరుకుని, పూర్తి శక్తిమేరకు ప్రాక్టీసులోనూ, మ్యాచ్ లోనూ పాల్గొంటారని భావించినట్టు టీమిండియా సిబ్బంది ఒకరు తెలిపారు.

More Telugu News