T2o match: టీ20 వరల్డ్ కప్ లో సంచలనం..సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్ అనూహ్య విజయం

  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా అకెర్‌మాన్
  • వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన సౌతాఫ్రికా
  • సెమీస్ కు చేరిన భారత్
NETHERLANDS WON MATCH AGAINST SOUTHAFRICA

టీ20 వరల్డ్ కప్ లో కీలక మ్యాచ్ లో సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. క్రికెట్ పసికూన నెదర్లాండ్స్ చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పెనుసంచలనం నమోదు చేసింది. బ్యాట్స్ మెన్, బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ఛేదించలేకపోయారు. 

నెదర్లాండ్ బౌలర్ల ధాటికి 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ నెదర్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. బ్రాండన్ గ్లోవర్ 3, ఫ్రెడ్ క్లాసెన్ 2 వికెట్లు, బాస్ డె లీడే 2, పౌల్ వాన్ మీకెరన్ 1 చొప్పున వికెట్లు తీశారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ లలో 25 పరుగులు చేసిన రిలీ రూసో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లలో డికాక్(13), బావూమా(20), మార్‌క్రమ్(17), డేవిడ్ మిల్లర్ (17), క్లాసెన్ (21), వేన్ పార్నెల్ (0), కేశవ్ మహరాజ్ (13), కగిసో రబడ(9 నాటౌట్), అన్రిచ్ నోర్జె (4 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

నెదర్లాండ్స్ ఓపెనర్లు ఎంబర్గ్ (37), మ్యాక్స్ డౌడ్(29) పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన టామ్ కూపర్ (35), అకెర్‌మాన్(41 నాటౌట్), డీ లెడే(1), ఎడ్వర్డ్స్ (12 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. నెదర్లాండ్ విజయంలో ముఖ్యపాత్ర పోషించిన అకెర్‌మాన్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ దక్కింది.

చివరి మ్యాచ్ కాకుండానే సెమీస్ లోకి భారత్..
నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా పరాజయం పాలవడంతో గ్రూప్-2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టుకు సెమీస్ బెర్త్ ఖాయమైంది. తర్వాతి స్థానంలో 5 పాయింట్లతో సౌతాఫ్రికా, చెరో 4 పాయింట్లతో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మూడు, నాలుగవ స్థానంలో ఉన్నాయి. ఈ రోజు పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో గెలిచే జట్టు 6 పాయింట్లతో సెమీస్ చేరుకుంటుంది. చివరి మ్యాచ్ లో అనూహ్య ఓటమితో సౌతాఫ్రికా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించనుంది.

More Telugu News