Rajwinder Singh: ఓ భారత పౌరుడి ఆచూకీ కోసం రూ.5.2 కోట్ల రివార్డు ప్రకటించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం

  • ఆస్ట్రేలియాలో నర్సుగా పనిచేసిన రజ్వీందర్ సింగ్
  • 2018లో టోయా అనే యువతి హత్య
  • దేశం విడిచి పారిపోయిన రజ్వీందర్ సింగ్
  • వేట కొనసాగిస్తున్న క్వీన్స్ లాండ్ పోలీసులు
Australian govt announces huge reward on murder suspect

రజ్వీందర్ సింగ్ అనే భారత పౌరుడి కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అతడి ఆచూకీ చెబితే రూ.5.2 కోట్ల రివార్డు అందిస్తామని ప్రకటించింది. అతడు హత్యారోపణలు ఎదుర్కొంటుండడమే అందుకు కారణం.

రజ్వీందర్ సింగ్ ఆస్ట్రేలియాలోని ఇన్నిస్ ఫాయిల్ లో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేవాడు. అయితే, 2018 అక్టోబరు 21న టోయా కార్డింగ్లే అనే యువతి క్వీన్స్ లాండ్ లో హత్యకు గురైంది. కెయిర్న్స్ ప్రాంతంలో తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్ కు వెళ్లిన 24 ఏళ్ల టోయా విగతజీవురాలిగా కనిపించింది. ఈ హత్యలో రజ్వీందర్ సింగ్ ప్రధాన అనుమానితుడు అని క్వీన్స్ లాండ్ పోలీసులు భావిస్తున్నారు. టోయా హత్య జరిగిన రెండ్రోజుల తర్వాత రజ్వీందర్ ఆస్ట్రేలియా విడిచి పారిపోవడంతో అతడిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. అతడు తన భార్యను, ముగ్గురు పిల్లలను ఆస్ట్రేలియాలోనే వదిలేసి పారిపోయాడు.

రజ్వీందర్ సింగ్ పంజాబ్ లోని బట్టర్ కలాన్ ప్రాంతానికి చెందినవాడు. అతడు భారత్ లోనే ఉన్నాడని ఆస్ట్రేలియా వర్గాలు విశ్వసిస్తున్నాయి. దీనిపై క్వీన్స్ లాండ్ డిటెక్టివ్ యాక్టింగ్ సూపరింటిండెంట్ సోనియా స్మిత్ స్పందిస్తూ, రజ్వీందర్ సింగ్ అక్టోబరు 22న కెయిర్న్స్ నగరాన్ని వీడాడని, 23న సిడ్నీ నుంచి భారత్ వెళ్లిపోయాడని వివరించారు. అతడు భారత్ కు చేరుకున్నట్టు తమ వద్ద కచ్చితమైన సమాచారం ఉందని సోనియా స్మిత్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో, అతడి ఆచూకీ తెలియజేయాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రజలను, విదేశాల్లో ఉన్నవారిని కోరుతున్నామని తెలిపారు. 

కాగా, క్వీన్స్ లాండ్ పోలీసు చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో రివార్డు ప్రకటించడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఈ కేసులో ఎవరైనా సమాచారం అందిస్తారన్న ఉద్దేశంతో హిందీ, పంజాబీ భాషలు మాట్లాడేవారితో ఓ ప్రత్యేక కేంద్రాన్ని కూడా క్వీన్స్ లాండ్ పోలీసులు ఏర్పాటు చేశారు. భారత్ నుంచి రజ్వీందర్ సింగ్ సమాచారాన్ని పంచుకునేవారితో మాట్లాడేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. 

దీనిపై ఢిల్లీలోని ఆస్ట్రేలియన్ హై కమిషన్ స్పందిస్తూ, రజ్వీందర్ సింగ్ సమాచారం తెలిసినవారు 91 11 41220972 నెంబరుకు తెలియజేయాలని సూచించింది. టోయా హత్య కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ ఛేదిస్తామని, టోయా ఎందుకు, ఎలా చనిపోయిందన్న అంశాలపై తాము ఆమె కుటుంబానికి సమాధానం చెప్పాల్సి ఉందని పేర్కొంది. 

కాగా, టోయా హత్యతో కుటుంబ సభ్యులు తీవ్ర వేదన అనుభవిస్తున్నారు. ఆమె తల్తి స్పందిస్తూ, టోయా స్నేహితులందరూ పెళ్లిళ్లు చేసుకుని పిల్లలతో జీవితంలో సెటిలయ్యారని, ఇవన్నీ తన కుమార్తె కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఉద్యోగంలో చేరాల్సి ఉండగా, అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని వెల్లడించారు.

More Telugu News