Andhra Pradesh: ద్రోణి ప్రభావంతో చురుగ్గా మారిన ఈశాన్య రుతుపవనాలు.. ఏపీలో వర్షాలు

  • నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • దక్షిణ కోస్తా, రాయలసీమల్లో నిన్న కూడా వర్షాలు
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
  • నెల్లూరులో రెండు రోజులుగా కురుస్తున్న వానలు
Moderate Rains Expected In Andhra Pradesh Today

నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఫలితంగా తమిళనాడుతోపాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో నిన్న ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నేడు కూడా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాలతోపాటు ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో అప్రమత్తమైన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి మొదలైన వర్షం నిన్నంతా కురుస్తూనే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నేడు కూడా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. నిన్న జిల్లా వ్యాప్తంగా సగటున 48.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా బోగోలు మండలంలో అత్యధికంగా 138.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

More Telugu News