Andhra Pradesh: పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం: సీఎం జగన్

CM YS Jagan participates AP formation day celebrations
  • ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి
  • తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో జాతీయ జెండా ఎగురవేసిన జగన్
  • తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు విగ్రహాల వద్ద నివాళి
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ,రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాల పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి రోజా సహా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 

రాష్ట్రావతరణ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘మన సంస్కృతిని, మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను, విజయాలను, ఈ నేలపై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం’ అని ఆయన ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Formation Day
YSRCP
YS Jagan
tadepally
national flag

More Telugu News