RGV: అతి త్వరలో రాజకీయ సినిమా తీయబోతున్నాను... ఇది బయోపిక్ కంటే లోతైనది: వర్మ

  • కొత్త సినిమా ప్రకటన చేసిన వర్మ
  • ఇది బయోపిక్ కంటే పవర్ ఫుల్ అని వెల్లడి
  • నూటికి నూరు పాళ్లు నిజాలే ఉంటాయని స్పష్టీకరణ
  • అహంకారానికి, ఆశయానికి మధ్య పోరాటం అని వివరణ
RGV announces political movie Vyuham

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. అతి త్వరలో రెండు పార్టులతో రాజకీయ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. మొదటి పార్టు టైటిల్ 'వ్యూహం' అని, రెండో పార్టు టైటిల్ 'శపథం' అని తెలిపారు. ఈ రెండు భాగాల్లోనూ రాజకీయ అరాచకీయాలు పుష్కలంగా ఉంటాయని తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

ఇది రాజకీయ సినిమా అని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇది బయోపిక్ కాదని, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని పేర్కొన్నారు. 

బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉంటాయేమో కానీ, రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయని వెల్లడించారు. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించినదే 'వ్యూహం' కథ అని రామ్ గోపాల్ వర్మ వివరించారు. 

ఇది రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుందని, రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా 'వ్యూహం' చిత్రం ఉంటుందని తెలిపారు. 

రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం 'వ్యూహం' షాక్ నుంచి తేరుకునేలోపే... పార్ట్-2 'శపథం'లో మరో ఎలక్ట్రిక్ షాక్ తగులుతుందని పేర్కొన్నారు. 

కాగా, తనతో 'వంగవీటి' చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ ఈ పొలిటికల్ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తారని వర్మ వెల్లడించారు.

వర్మ నిన్న ఏపీ సీఎం జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. జగన్ తో లంచ్ సమావేశం జరిపిన వర్మ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. జగన్ ను కలిసిన మరుసటి రోజే ఆయన రాజకీయ చిత్రాన్ని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

అటు, ఏపీ బీజేపీ కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మతో వ్యక్తులను, పార్టీలను టార్గెట్ చేస్తూ సినిమాలను తెరకెక్కించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోందని వెల్లడించారు. అదే నిజమైతే "రాజకీయాలలో హత్యలు ఉండవు... ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి"అనే నానుడి వర్మను సినిమా తీయాలని ప్రోత్సహించేవారికి సరిగ్గా సరిపోతుందని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి ఈ మేరకు నిన్ననే ట్వీట్ చేయడం గమనార్హం.

More Telugu News