Munugode: గద్దర్‌ను భయపెట్టి పోటీ నుంచి తప్పుకునేలా చేశారు: కేఏ పాల్

Why I Contesting from Munugode is KA Paul says reason
  • తనకు కూడా అధికారులు అడ్డంకులు సృష్టించారన్న పాల్
  • గద్దర్ పోటీ చేయకున్నా పాట ద్వారా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారన్న ప్రజాశాంతి పార్టీ అధినేత
  • పాలకుల నిర్లక్ష్యం మునుగోడుకు శాపంగా మారిందని విమర్శ
  • తనను గెలిపిస్తే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ గడువు నిన్నటితో ముగిసింది. చివరి రోజు నామినేషన్లు వేసేందుకు పలు పార్టీల నేతలు క్యూ కట్టారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలో చేరిన ప్రజా గాయకుడు గద్దర్ మునుగోడు నుంచి బరిలోకి దిగుతారని ప్రచారం చేశారు. అయితే, చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకోవడంతో అధినేత కేఏ పాల్ స్వయంగా బరిలోకి దిగి నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ.. తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్‌ను నామినేషన్ వేయకుండా అధికార పార్టీ నాయకులు బెదిరించారని ఆరోపించారు. గద్దర్ నామినేషన్ వేయకున్నా తన పాట ద్వారా పార్టీకి మద్దతు ఉంటుందని చెప్పారని అన్నారు. తాను నామినేషన్ వేసేందుకు రాకుండా అధికారులు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. పాలకుల నిర్లక్ష్యం మునుగోడుకు శాపంగా మారిందని, అభివృద్ధికి నోచుకోక వెనకబాటుకు గురైందని అన్నారు. ప్రజలు తనను గెలిపిస్తే మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పాల్ హామీ ఇచ్చారు.

More Telugu News

Munugode
Prajashanti Party
KA Paul
Gaddar