Krishna District: హత్యకేసును తారుమారు చేసే యత్నం.. లంచావతారాలైన సీఐ, ఎస్సైలను పట్టించిన శునకాలు!

  • హత్యకేసులో నిందితులను రక్షించేందుకు పెద్ద మొత్తంలో లంచం తీసుకున్న ఇన్స్‌పెక్టర్, ఎస్సై
  • కేసు నిందితుల మెడకు చుట్టుకోకుండా రూ. 1.50 కోట్లతో డీల్
  • సీఐకి రూ. 12.50 లక్షలు, ఎస్సైకి రూ. 1.60 లక్షల లంచం
  • మరో హత్యకేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అసలు విషయం
  • సీఐ, ఎస్సైలను అరెస్ట్ చేసిన పోలీసులు
 attempt to manipulate murder case dogs caught bribery CI and SI

ఓ హత్యకేసును తారుమారు చేసి కప్పిపుచ్చేందుకు భారీ మొత్తంలో లంచాలు తీసుకున్న ఓ సీఐ, ఎస్సైలను శునకాలు పట్టించాయి. ప్రస్తుతం వీరిద్దరూ జైలులో ఊచలు లెక్కబెడుతున్నారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ ఏడాది జులై 26న కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఆళ్లవారిపాలెంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని తేలింది. ఈ కేసులో ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్టు తేలింది.

ఈ విషయం వెలుగులోకి వస్తే తమ కుటుంబ పరువు పోతుందని భావించిన శ్రీకాంత్‌రెడ్డి అధికార పార్టీకి చెందిన జొన్నల నరేంద్రరెడ్డిని ఆశ్రయించాడు. విషయం విన్న ఆయన రూ.1.50 కోట్లు ఖర్చవుతుందని చెప్పి ఆ మేరకు డీల్ కుదుర్చుకున్నారు. అనంతరం పమిడిముక్కల సీఐ మేడికొండ ముక్తేశ్వరరావు, తోట్లవల్లూరు ఎస్సై యాదగిరి అర్జున్‌ను సంప్రదించారు. కేసును తారుమారు చేసేందుకు సీఐకి రూ.12.50 లక్షలు, ఎస్సైకి రూ. 1.60 లక్షలు ముట్టజెప్పారు. దీంతో శ్రీనివాసరెడ్డి హత్య కేసులో ఆళ్ల శ్రీకాంత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను నిందితులుగా చేర్చకుండా సీఐ తప్పించే ప్రయత్నం చేశారు. 

ఈ డీల్ గురించి తెలుసుకున్న తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలేనికి చెందిన అధికారపార్టీ నేత పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి.. తానైతే ఇంతకంటే తక్కువకే డీల్ కుదిర్చేవాడినని ఆళ్ల కుటుంబానికి చెప్పారు. మరోవైపు, తోట్లవల్లూరు మండలంలో పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి, నరేంద్రరెడ్డికి మధ్య మధ్యవర్తిత్వం కేసుల్లో గొడవ నడుస్తోంది. దీంతో శ్రీనివాసరెడ్డిని అడ్డు తొలగించుకోవాలని నరేంద్ర ప్లాన్ వేశాడు. డీల్ గురించి మాట్లాడుకుందామని పిలిపించి హత్య చేశాడు. అనంతరం శవాన్ని తీసుకెళ్లి ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్లిపర్రు వద్ద పూడ్చేశారు. దీంతో పని పూర్తయిందని భావించాడు. అయితే, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

శ్రీనివాసరెడ్డి కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు గత నెల 23న తోట్లవల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, పాతిపెట్టిన శ్రీనివాసరెడ్డి శవాన్ని శునకాలు పీక్కుని తింటుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తొలుత గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత జరిపిన విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య, నిందితులను రక్షించే ప్రయత్నం, ఈ క్రమంలో సీఐ, ఎస్సైలు లంచం తీసుకున్న విషయాలు బయటపడ్డాయి. పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి హత్యకేసులో నరేంద్రరెడ్డిని గత నెల 27న అరెస్ట్ చేసిన పోలీసులు.. నిన్న సీఐ ముక్తేశ్వరరావు, ఎస్సై అర్జున్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

More Telugu News