Aha: 'అన్‌స్టాప‌బుల్ 2'లో చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్నీ అబద్దాలే: వైసీపీ ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి

  • 'అన్‌స్టాప‌బుల్ 2' ప్రోమోలో చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై న‌ల్ల‌ప‌రెడ్డి మండిపాటు
  • చంద్ర‌బాబు కాళ్లు ప‌ట్టుకుని లాగే ర‌క‌మ‌న్న వైసీపీ ఎమ్మెల్యే
  • నాడు ఎన్టీఆర్‌కు 14 మందిమి అండ‌గా నిలిచిన‌ట్లు వెల్లడి
  • నాడు ఎన్టీఆర్‌కు ద్రోహం చేసి నేడు ఆయ‌న భ‌జ‌న చేస్తున్నార‌ని ధ్వ‌జం
ysrcp mla nallapareddy prasanna kumar reddy angry over chandrababi comments in unstoppable promo

ఆహా ఓటీటీ వేదిక‌గా న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్‌గా ప్ర‌సారం అవుతున్న 'అన్‌స్టాప‌బుల్ 2'లో తొలి ఎపిసోడ్‌కు అతిథిగా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు హాజ‌రు కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా... మంగ‌ళ‌వారం సాయంత్రం ఆహా యాజ‌మాన్యం ప్రోమోను విడుద‌ల చేసింది. సోష‌ల్ మీడియాలో ఈ ప్రోమో వీడియో వైర‌ల్‌గా మారిపోయింది. ఈ వీడియోలో చంద్ర‌బాబు చెప్పిన ప‌లు అంశాల‌పై తాజాగా బుధ‌వారం గ‌తంలో టీడీపీలో కొన‌సాగి ప్ర‌స్తుతం వైసీపీ నేత‌గా కొన‌సాగుతున్న నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే న‌ల్ల‌ప‌రెడ్డి ప్ర‌స‌న్నకుమార్ రెడ్డి స్పందించారు.

అన్‌స్టాప‌బుల్ ప్రోమోలో చంద్ర‌బాబు చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని న‌ల్ల‌ప‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్‌ను సీఎం ప‌ద‌వి నుంచి దించి మాన‌సికంగా ఆయ‌న‌ను చంద్ర‌బాబు హ‌త్య చేశార‌ని ఆరోపించారు. త‌న తండ్రికి ద్రోహం చేసిన వ్య‌క్తిని బాల‌కృష్ణ ఇంట‌ర్వ్యూకి ఎలా పిలిచార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నాడు టీడీపీని చంద్ర‌బాబు లాగేసుకున్న స‌మ‌యంలో త‌న‌తో పాటు 14 మంది ఎమ్మెల్యేలం ఎన్టీఆర్‌తోనే ఉన్నామ‌ని చెప్పారు. ఎన్టీఆర్ చ‌నిపోయే దాకా కూడా తాము 14 మందిమీ ఆయ‌న‌తోనే ఉన్నామ‌న్నారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు, రామోజీరావుల‌కు అమ్ముడుబోయార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు కాళ్లు ప‌ట్టుకునే ర‌కం కాద‌ని... కాళ్లు ప‌ట్టుకు లాగే ర‌క‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్‌ది ప‌సిపిల్ల‌ల మ‌న‌స్త‌త్వ‌మ‌న్న న‌ల్ల‌ప‌రెడ్డి... చంద్ర‌బాబుది నీచమైన మ‌న‌స్త‌త్వం అని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబులో న‌ర‌న‌రాన విష‌మే ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. న‌మ్మి ఆడ‌బిడ్డ‌ను ఇస్తే చంద్ర‌బాబు త‌న మామ గొంతు కోశాడ‌ని ఆరోపించారు. ఎన్టీఆర్‌ను సీఎం ప‌ద‌వి నుంచి దించే కుట్ర‌లో బాల‌కృష్ణ‌కు కూడా పాత్ర ఉంద‌న్నారు. అల్లుళ్లు, కొడుకులు క‌లిసి ఎన్టీఆర్‌కు ద్రోహం చేశార‌ని ఆయ‌న ఆరోపించారు. నాడు ఎన్టీఆర్‌కు ద్రోహం చేసిన వారే నేడు ఆయ‌న భజన చేస్తున్నార‌ని న‌ల్ల‌ప‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. వియ్యంకుడి షోలో కూర్చుని అబ‌ద్ధాలు చెప్పినంత మాత్రాన రాష్ట్ర ప్ర‌జ‌లు చంద్ర‌బాబు చేసిన మోసాన్ని మ‌రిచిపోర‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News