india: చరిత్ర సృష్టించిన భారత రెజ్లర్​ బజ్​ రంగ్​ పునియా

Bajrang Punia becomes 1st Indian to win 4 medals at World Wrestling
  • ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో నాలుగు పతకాలతో రికార్డు
  • తాజా ఎడిషన్ లో కాంస్య పతకం గెలిచిన పూనియా
  • కాంస్య పతక పోరులో 11-9తో గెలుపు
భారత స్టార్ రెజ్లర్ బజ్ రంగ్ పూనియా కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్ఠాత్మక ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ లో  నాలుగు పతకాలు సాధించిన భారత తొలి రెజ్లర్ గా నిలిచాడు. ఆదివారం సెర్బియాలోని బెల్ గ్రేడ్ లో ముగిసిన తాజా ఎడిషన్ లో అతను అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. పురుషుల ఫ్రీ స్టయిల్ 65 కేజీల విభాగంలో పూనియా ఈ పతకం నెగ్గాడు. వాస్తవానికి ఈ టోర్నీలో బజ్ రంగ్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. కానీ, అతడిని ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైకేల్ ఫైనల్ చేరుకోవడంతో భారత రెజ్లర్ కు రెజిచేజ్ ద్వారా కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం దక్కింది. 

దీన్ని బజ్ రంగ్ రెండు చేతులా సద్వినియోగం చేసుకున్నాడు. రెజిచేజ్ తొలి బౌట్లో 7-6తో వాజ్ బెజ్ తెవాన్యన్ (అర్మేనియా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. అనంతరం జరిగిన కాంస్య పతక బౌట్ లో పూనియా 11-9తో సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)పై విజయం సాధించి పతకం గెలుచుకున్నాడు. 2013లో 60 కేజీల విభాగంలో కాంస్యం, 2018లో 65 కేజీల విభాగంలో రజతం గెలిచిన బజ్ రంగ్ 2019లో కాంస్యం గెలిచాడు. మొత్తం ఏడు సార్లు పోటీపడ్డ అతను నాలుగు పతకాలతో ప్రపంచ చాంపియన్ షిప్ లో అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
india
wrestler
Bajrang Punia
record
4 medals
World Wrestling

More Telugu News