Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం నిర్మాణంలో ఏపీ గ్రానైట్ రాళ్లు

Granite Stones from AP being used in Ayodhya Ram Mandir construction
షార్ట్స్‌లో చూడండి
అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో, ప్రస్తుతం అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతోంది. 

తాజాగా ట్రస్టు ఆలయ నిర్మాణ పనులపై ప్రకటన చేసింది. గర్భగుడితో పాటు ఐదు మండపాల నిర్మాణం వేగంగా సాగుతోందని వెల్లడించింది. 6.5 మీటర్ల ప్లింత్ బీమ్ నిర్మాణం పూర్తయిందని, దానిపైనే రామ మందిర ప్రధాన కట్టడం రూపుదిద్దుకోనుందని తెలిపింది. ఈ ప్లింత్ నిర్మాణం కోసం ఇంజినీర్లు గ్రానైట్ రాళ్లను ఎంపిక చేశారని తెలిపింది. 

ఇందుకోసం 17,000 గ్రానైట్ రాళ్లను వినియోగించారని, వీటిని ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న గ్రానైట్ గనుల నుంచి తెప్పించినట్టు ట్రస్టు వివరించింది. ఈ గ్రానైట్ రాళ్లు నాణ్యతలో అత్యున్నతమైనవని పేర్కొంది. బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వీటి నాణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసిందని ట్రస్టు వెల్లడించింది. 

ఇక ప్రధాన ఆలయ నిర్మాణానికి రాజస్థాన్ ఇసుకరాతిని ఉపయోగిస్తున్నట్టు వివరించింది. కాగా, అయోధ్య రామమందిరం అంచనా వ్యయం రూ.1,800 కోట్లు అని ట్రస్టు ప్రధాన కార్యదర్శి వెల్లడించారు.
Go Back to Shorts
Ayodhya Ram Mandir
Granite Stones
Andhra Pradesh

More Telugu News