Supreme Court: సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ నేడే.. ఆయన తీర్పు ఇచ్చే కీలక కేసులు ఇవే!

  • ఈ రోజుతో  ముగియనున్న జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం
  • ఐదు కీలక కేసులపై తీర్పు ఇవ్వనున్న సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం
  • జాబితాలో ‘ఎన్నికల ఉచితాలు’, ‘గోరఖ్ పూర్ అల్లర్ల పిటిషన్’
CJI NV Ramana to deliver verdicts in 5 high profile cases on last day

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం ఈ రోజుతో ముగుస్తుంది.  సీజేఐగా చివరి రోజు ఆయన విచారించే కేసుల వివరాలను గురువారం అర్థరాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అప్‌డేట్ చేసింది. తన పదవీకాలం ముగిసే రోజున ఎన్వీ రమణ ఐదు కీలక తీర్పులు వెలువరించనున్నారు. సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ హిమ కోహ్లీ, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ ఐదు కేసులను విచారించి, తీర్పు ఇవ్వనుంది. అవేంటో చూద్దాం.

ఎన్నికల ఉచితాలు

సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాగ్దానం చేసే ‘అహేతుకమైన ఉచితాలను’ నిషేధించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై తీర్పును వెలువరించనుంది. ఢిల్లీ బీజేపీ నేత అశ్వనీ ఉపాధ్యాయ దాఖలు చేసిన ఈ పిటిషన్ దేశంలో ‘రేవారీ సంస్కృతి’పై భారీ చర్చకు తెరతీసింది. 

బుధవారం ఈ వ్యాజ్యాన్ని విచారిస్తున్నప్పుడు, రాజకీయ పార్టీలు, అవి చేసే ఎన్నికల వాగ్దానాలకు ఆదేశాలు జారీ చేయడానికి కోర్టుకు ఉన్న అధికార పరిధిని, అలాగే ఉచితాలను ఎలా నిర్వచించాలనే దానితో సహా వివిధ అంశాలను కోర్టు పరిగణించవలసి ఉంటుందని సీజేఐ గమనించారు. ‘ఉచితాల’ విషయంలో ఆప్, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, డీఎంకే సహా వివిధ రాజకీయ పార్టీలు తమ సూచనలు, అభిప్రాయాలను సమర్పించాయి. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో పరిశీలించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఎందుకు పిలవలేదని సీజేఐ ప్రశ్నించారు.

గోరఖ్‌పూర్ అల్లర్లపై పిటిషన్

2007లో గోరఖ్‌పూర్‌లో అనేక హింసాత్మక సంఘటనలను రెచ్చగొట్టి ద్వేషపూరిత ప్రసంగాల ఆరోపణపై ప్రస్తుత సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతరులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిని మంజూరు చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయనుంది. బుధవారం ఈ కేసులో వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

కర్ణాటక మైనింగ్ కేసు

2009లో సమాజ్ పరివర్తన్ సముదాయ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్.. భారీ అక్రమ మైనింగ్ కారణంగా కర్ణాటకలో ఇనుప ఖనిజం గనులను మూసివేయడానికి దారితీసింది. అయితే, ఇనుప ఖనిజం, గుళికల ఎగుమతిపై పూర్తి నిషేధం విధిస్తూ 2013లో కొన్ని గనులను తిరిగి తెరవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఇనుప ఖనిజం ఎగుమతిపై దశాబ్దాల నాటి నిషేధాన్ని ఎత్తివేయడానికి, కర్ణాటకలో ఇనుప ఖనిజం తవ్వకాలపై జిల్లా స్థాయి పరిమితులను తొలగించడానికి వివిధ మైనింగ్ కంపెనీలు దాఖలు చేసిన పలు దరఖాస్తులు కోర్టు పరిశీలనలో ఉన్నాయి. 

రాజస్థాన్ మైనింగ్ లీజు సమస్య

రాజస్థాన్ మైనింగ్ లీజు విషయంలో 2016లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాజస్థాన్ ప్రభుత్వం చేసిన అప్పీల్‌పై సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. ఈ ప్రాంతంలో మైనింగ్‌ను కొనసాగించడానికి అనుమతిస్తే అపారమైన పర్యావరణ నష్టం వాటిల్లుతుందని రాజస్థాన్ ప్రభుత్వం వాదించింది. పర్యావరణ క్లియరెన్స్‌కు లోబడి మైనింగ్ కార్యకలాపాలను ప్రారంభించడానికి కంపెనీని అనుమతిస్తూ 2003లో జారీ చేసిన లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో 2005 నుంచి ఈ సమస్య న్యాయ పోరాటంలో ఉంది.

దివాలా చట్టం కింద లిక్విడేషన్ ప్రొసీడింగ్స్‌పై నిబంధనలు

విజయవంతమైన బిడ్డర్ ద్వారా చెల్లింపు కోసం 90 రోజుల సమయం ఉందా? అనే అంశంపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ ఏటీ) జారీ చేసిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా ఏబీజ షిప్‌యార్డ్ అధికారిక లిక్విడేటర్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పును ప్రకటిస్తుంది.

More Telugu News