PVP Cinemas: చెక్ బౌన్స్ కేసు.. ‘ది వారియర్’ దర్శకుడు లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష

  • తెలుగు తమిళ భాషల్లో కమర్షియల్ చిత్రాలకు లింగుస్వామి పెట్టింది పేరు
  • పీవీపీ సినిమాస్ నుంచి తీసుకున్న అప్పును చెక్కు రూపంలో చెల్లించిన లింగుస్వామి బ్రదర్స్
  • చెక్ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించిన పీవీపీ సినిమాస్
Kollywood Director  N Lingusamy sentenced to 6 months jail

తెలుగు, తమిళ భాషల్లో కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామికి చెక్‌బౌన్స్ కేసులో చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కొన్ని సంవత్సరాల క్రితం.. కార్తి, సమంత జంటగా ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ పేరుతో ఓ సినిమా తీయాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ సినిమాస్ నుంచి అప్పు తీసుకున్నారు. 

అయితే, ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో పీవీపీ సినిమాస్ నుంచి తీసుకున్న సొమ్మును చెక్కు రూపంలో తిరిగి చెల్లించారు. వారిచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. నిన్న ఈ కేసు విచారణకు రాగా లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్‌లకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. సైదాపేట్ కోర్టు తీర్పుపై లింగుస్వామి సోదరులు అప్పీలుకు వెళ్లనున్నారు. 

ఇటీవల విడుదలైన రామ్ సినిమా ‘ది వారియర్’ను తెరకెక్కించింది లింగుస్వామే. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా బోల్తా కొట్టింది. కాగా, లింగుస్వామి దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాత కూడా. తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్‌పై పలు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ పైనా కేసులు ఉన్నాయి.

More Telugu News