Amul: రేపటి నుంచి పాల ధరలు లీటర్ కు రూ.2 చొప్పున పెంచిన అమూల్, మదర్ డైరీలు

amul and mother dairy milk prices to rise by rs 2 from tomorrow
  • ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో పెంచినట్టు వెల్లడి
  • త్వరలో దేశవ్యాప్తంగా పెంపు అమల్లోకి వస్తుందని ప్రకటన
  • పాల సేకరణ, ఇతర వ్యయాలు పెరగడం వల్లే ధరలు పెంచామని వివరణ
దేశవ్యాప్తంగా తాము విక్రయిస్తున్న పాల ధరలను పెంచుతున్నట్టు అమూల్, మదర్ డెయిరీలు వేర్వేరుగా ప్రకటించాయి. పాల సేకరణ, ఇతర వ్యయాలు పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపాయి. లీటర్ కు రూ.2 చొప్పున పెంచుతున్నామని..  ఆగస్టు 17వ తేదీ (బుధవారం) నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. కంపెనీలు వెల్లడించిన వివరాల మేరకు.. వివిధ కేటగిరీల్లో విక్రయించే అన్ని రకాల పాల ధరలు పెరుగుతున్నాయి.

అహ్మదాబాద్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో అర లీటరు (500 మిల్లీలీటర్లు) పాలకు సంబంధించి అమూల్ గోల్డ్ ప్యాకెట్ ధర రూ.31కి, అమూల్ తాజా ప్యాకెట్ ధర రూ.25కు, అమూల్ శక్తి ప్యాకెట్ ధర రూ.28కి పెంచుతున్నట్టు అమూల్ డైరీ మాతృసంస్థ గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయని పేర్కొంది.

మదర్ డెయిరీకి సంబంధించి ఫుల్ క్రీమ్ మిల్క్ ధర రూ.61 కి పెరిగింది. టోన్డ్ పాల ధర రూ.51కి, డబుల్ టోన్డ్ పాల ధర రూ.45కు, టోకుగా ఇచ్చే పాల ధర రూ.48కి పెంచుతున్నట్టు మదర్ డెయిరీ ప్రకటించింది. ఇప్పటికే ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాల్లో ధరలు పెంచామని, మిగతా చోట్ల కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది.
Amul
Mother Dairy
Milk
Milk price
Milk price hike
India
Business

More Telugu News