Prime Minister: మూడు ‘హెల్త్ స్కీమ్’లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!
- దేశవాసులు అందరికీ నాణ్యమైన వైద్య సేవలు
- అందుబాటు ధరలకు అందించే లక్ష్యంతో ఒక పథకం
- వైద్యులకు విదేశాల్లో చికిత్సా విధానాలపై శిక్షణ
- దేశంలో మెడికల్ టూరిజం ప్రోత్సాహానికి మరో పథకం
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 15న మూడు ఆరోగ్య పథకాలపై ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘పీఎం జన్ ఆరోగ్య యోజన’, ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’, పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్’ను ఒకే పథకం కింద కేంద్ర సర్కారు అమలు చేయనుంది. ‘పీఎం సమగ్ర స్వస్త్య యోజన’ పేరుతో దీన్ని తీసుకురానుందని అధికార వర్గాల సమాచారం.
అందరికీ నాణ్యమైన వైద్య సేవలను అందుబాటు ధరలకు అందించడం ఈ పథకం లక్ష్యమని తెలుస్తోంది. ప్రధాన మంత్రి ప్రకటన తర్వాతే ఈ పథకం గురించి సమగ్ర వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. ‘హీల్ బై ఇండియా’ పేరుతో మరో పథకాన్ని కూడా ప్రధాని ప్రకటించనున్నారు. ఈ పథకం కింద మన దేశ వైద్యులను ఏటా కొంత మందిని విదేశాలకు పంపించి వారికి వివిధ చికిత్సల విధానాలపై శిక్షణ ఇప్పించనున్నారు. ‘హీల్ ఇన్ ఇండియా’ అన్నది మరో పథకం. దీని కింద భారత్ లో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడం కేంద్ర సర్కారు ఉద్దేశ్యం.