Bomb: టిష్యూ పేపర్ పై బాంబు బెదిరింపు.. బెంగళూరు విమానాశ్రయంలో ఉత్కంఠ

  • జైపూర్ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో చోటు చేసుకున్న ఘటన
  • విమానం, ప్రయాణికుల బ్యాగేజీల తనిఖీ
  • ప్రయాణికుల చేతి రాత పరీక్ష
  • ఆకతాయి బెదిరింపుగా నిర్థారణ
Bomb on plane threat creates flutter at Bengaluru airport

చేతిని తుడుచుకునే టిష్యూ పేపర్ పై బాంబు హెచ్చరిక ఉండడం అన్నది ఉత్కంఠకు దారితీసింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమాశ్రయంలో ఆదివారం రాత్రం 9.26 గంటల తర్వాత నుంచి జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

ఇండిగోకు చెందిన 6ఈ-556 విమానం జైపూర్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి వచ్చింది. విమానంలోని టాయిలెట్స్ వద్ద చిరిగిపోయిన టిష్యూ పేపర్ ఫ్లోర్ బోర్డ్ పై పడి ఉండడంతో ఓ ఉద్యోగి చూసి పైలట్ కు సమాచారం ఇచ్చారు. ఆ టిష్యూ పేపర్ పై ‘విమానాన్ని కిందకు దించొద్దు. ఈ విమానంలో బాంబు ఉంది’ అని హిందీలో రాసి ఉండడాన్ని చూశారు. పైలట్ ఈ సమాచారాన్ని విమానాశ్రయం అధికారులకు తెలియజేశాడు. 

అయితే, ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పకుండా విమానాన్ని ప్రత్యేక మార్గంలోకి తీసుకెళ్లారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానం అంతటా తనిఖీలు చేశారు. 174 మంది ప్రయాణికుల బ్యాగులను కూడా మెటల్ డిటెక్టర్లతో పరీక్షించి చూశారు. వారికి ఎక్కడా బాంబు జాడ కనిపించలేదు. దీంతో ఆకతాయి బెదిరింపుగా నిర్ధారణకు వచ్చారు. 174 మంది ప్రయాణికులతోపాటు, డజను మంది విమాన సిబ్బంది చేతి రాతను పరీక్షించి చూశారు. అనుమానంగా అనిపించిన ఇద్దరు ప్రయాణికులు మినహా మిగిలిన వారిని పంపించివేశారు.

More Telugu News