Partha Chatterjee: స్కూల్ జాబ్స్ కుంభకోణం: అరెస్ట్ తర్వాత ఆసుపత్రి పాలైన పశ్చిమ బెంగాల్ మంత్రి

Bengal minster Partha Chatterjee arrested
  • పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీలను అరెస్ట్ చేసిన ఈడీ
  • పార్థను రెండు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు
  • ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామన్న టీఎంసీ 
బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డులో జరిగిన రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో టీఎంసీ సీనియర్ నేత, మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నిన్న అరెస్ట్ చేసింది. కోల్‌కతాలోని అర్పిత ఇంట్లో ఈడీ నిర్వహించిన సోదాల్లో రూ. 21 కోట్లు పట్టుబడిన తర్వాత ఈడీ అధికారులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

అర్పిత ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో నగదుతోపాటు బంగారు నగలు, విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పార్థ ఛటర్జీని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను బంక్‌షల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు ఆయనను రెండు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, నిన్న సాయంత్రం అస్వస్థతకు గురైన పార్థను ప్రభుత్వ ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఐసీయూలో ఆయన చికిత్స పొందుతున్నారు.

మంత్రి అరెస్ట్‌పై టీఎంసీ స్పందించింది. స్కూల్ జాబ్స్ కుంభకోణంలో మంత్రిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి మాత్రం ఆయనను పార్టీ నుంచి కానీ, మంత్రి పదవి నుంచి కానీ తొలగించబోమని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ తెలిపారు.
Partha Chatterjee
Arpita Mukherjee
West Bengal
TMC

More Telugu News