Telangana: తెలంగాణ‌లో విలీనం చేయాలంటూ ఏపీకి చెందిన ఆ 5 గ్రామాల తీర్మానం

  • పోలవ‌రం ముంపు నేప‌థ్యంలో ఏపీలో విలీనం అయిన 7 మండ‌లాలు
  • వాటిలోని 5 గ్రామాల‌ను తెలంగాణ‌లో విలీనం చేయాల‌న్న పువ్వాడ‌
  • ఈ 5 గ్రామాల్లో క‌ర‌క‌ట్ట‌తో భ‌ద్రాద్రి ముంపును నివారించ‌వ‌చ్చ‌న్న మంత్రి
  • అందుకు అనుకూలంగా తీర్మానం చేసిన 5 గ్రామాల పంచాయ‌తీలు
5 villages in andhra pradess passes a resolution to merge them in telangana

ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల కార‌ణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర‌ద‌లు పోటెత్తాయి. తెలంగాణ‌లోని భ‌ద్రాచ‌లం ప‌రిస‌రాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ క్ర‌మంలో ఏపీలో క‌డుతున్న పోల‌వరం ప్రాజెక్టు కార‌ణంగానే భ‌ద్రాద్రి మునిగిపోయింద‌ని తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రులు వ‌రుస‌గా స్పందించ‌డం, వాటికి పువ్వాడ తిరిగి స‌మాధానం ఇవ్వ‌డం తెలిసిందే. 

ఈ క్ర‌మంలో పోల‌వ‌రం ముంపు నేప‌థ్యంలో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు చెందిన 7 మండలాల‌ను ఏపీలో క‌లుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ 7 మండ‌లాల్లోని 5 గ్రామాల(భ‌ద్రాచలానికి అత్యంత సమీపంగా ఉన్న గ్రామాలు)ను తెలంగాణ‌లో విలీనం చేయాల‌ని పువ్వాడ కొత్త డిమాండ్ చేశారు. ఈ గ్రామాలను తెలంగాణ‌కు ఇస్తే... పోల‌వ‌రం బ్యాక్ వాట‌ర్ నుంచి భ‌ద్రాద్రికి ముప్పు లేకుండా క‌ర‌క‌ట్ట క‌ట్టుకుంటామ‌ని ఆయ‌న ప్ర‌తిపాద‌న చేశారు. ఈ ప్ర‌తిపాద‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం స‌సేమిరా అంటోన్న విష‌యం తెలిసిందే.

తాజాగా తెలంగాణ‌లో విలీనం చేయాలంటూ పువ్వాడ అజ‌య్ ప్ర‌స్తావించిన 5 గ్రామాలు త‌మ పంచాయ‌తీ కార్య‌వ‌ర్గ స‌మావేశాల‌ను గురువారం నిర్వహించాయి. ఈ స‌మావేశాల్లో త‌మ గ్రామాల‌ను తెలంగాణ‌లో విలీనం చేసే విష‌యంపై కూలంక‌షంగానే చ‌ర్చించాయి. ఈ సంద‌ర్భంగా తాజా వ‌ర‌ద‌ల‌పై గ్రామ పంచాయ‌తీలు దృష్టి సారించాయి. అన్ని ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం త‌మ గ్రామాల‌ను తెలంగాణ‌లో విలీనం చేయాల‌ని 5 గ్రామాలూ తీర్మానం చేశాయి.

More Telugu News