Yanamala: ప్రచారంపై ఉన్న శ్రద్ధ.. ప్రజా సమస్యల పరిష్కారంపై లేదు: జగన్ పై యనమల ఫైర్

  • జగన్ మాటలు నేతి బీరకాయలో నెయ్యిలా ఉంటాయన్న యనమల 
  • ఆయన చేసే సామాజిక న్యాయం ఒక బూటకమని విమర్శ 
  • సామాజిక న్యాయం కంటే.. ఆయన చేసే అసామాజిక న్యాయమే ఎక్కువని కామెంట్ 
Yanamala comments on Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డికి ప్రచారంపై ఉన్న శ్రద్ధ... ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని అన్నారు. ఆయన చెప్పే మాటలు నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉంటాయని దుయ్యబట్టారు. జగన్ చెప్పే సామాజిక న్యాయంలో చిత్తశుద్ధి లేదని... ఆయన సామాజిక న్యాయం బూటకమని అన్నారు. ఆయన చేసే సామాజిక న్యాయం కంటే... అసామాజిక న్యాయమే ఎక్కువని చెప్పారు. 

సమ సమాజం, నవ సమాజం స్థాపనలపై  జగన్ కు చిత్తశుద్ధి లేదని అన్నారు. ప్రతి సంక్షేమ పథకంలో రకరకాల నిబంధనలు పెట్టి, లక్షలాది మంది లబ్ధిదారులను తొలగించారని చెప్పారు. సంక్షేమ పథకాల్లో జగన్ పెట్టిన కోతలపై శ్వేతపత్రం విడుదల చేయాలని యనమల అన్నారు. ఈ మూడేళ్లలో సామాజిక న్యాయం కోసం జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News