నేను దుర్గాదేవిని.. నా భర్తను విడిచిపెట్టండి: పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మహిళ
- బీహార్లోని జాముయ్ జిల్లాలో ఘటన
- తనలో దుర్గాదేవి ఉందన్న మహిళ
- పోలీసుల తలలపై బియ్యం చల్లుతూ మంత్రాలు పఠించిన వైనం
- అరెస్ట్ తప్పదని హెచ్చరించడంతో శాంతించిన మహిళ
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాగుడుకు బానిసైన సంజూదీవి భర్త కార్తీక్ సికంద్రా బ్లాక్లోని లచ్చువార్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అతడిని ఎలాగైనా విడిపించుకోవాలని నిర్ణయించిన సంజూదేవి ఓ చేతిలో కర్ర, మరో చేతిలో బియ్యం పట్టుకొని పోలీస్ స్టేషన్కు చేరుకుంది. తాను భక్తురాలినని, తనలో దుర్గామాత ఉందని పేర్కొంది. తన భర్తను కాపాడుకోవడానికి వచ్చానని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు.
అంతేకాదు, పట్టుకొచ్చిన కర్రను ఊపుతూ మంత్రాలు పఠిస్తున్నట్టు నటిస్తూ బియ్యం గింజలను పోలీసులు, సిబ్బందిపైకి విసిరింది. దీంతో పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు గంటపాటు ఈ తతంగం నడిచింది. స్పందించిన మహిళ కానిస్టేబుళ్లు ఆమెను బయటకు తరిమారు. నిన్ను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది.