YSRCP: విజయలక్ష్మి, షర్మిల, అనిల్‌కు రక్షణ కల్పించండి: అమిత్ షాను కోరిన ఆనం వెంకటరమణారెడ్డి

TDP leader Anam Ramanarayana Reddy serious allegations on ys jagan
  • గత ఎన్నికల సమయంలో వివేకానందరెడ్డి మరణించారన్న ఆనం
  • మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అనుమానంగా వుందన్న టీడీపీ నేత
  • ఆదాన్ డిస్టలరీ జగన్ సూట్‌కేసు కంపెనీ అని ఆరోపణ
వైఎస్ కుటుంబంలో ఎవరు, ఎవరిని చంపుతారో తెలియదని, కాబట్టి వైఎస్ విజయలక్ష్మి, షర్మిల, ఆమె భర్త అనిల్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు. నెల్లూరులో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ విజ్ఞప్తి చేశారు. 

గత ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి మరణించారని, ఆ నిందను టీడీపీ వాళ్లపైకి నెట్టేశారని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, కాబట్టి వైఎస్ కుటుంబంలో ఎవరిని, ఎవరు చంపుతారోనన్న అనుమానం కలుగుతోందన్నారు. 

వైఎస్సార్‌ది ప్రమాదం కాదు, హత్య అని, దానిని రిలయన్స్ వాళ్లే చేశారని అప్పట్లో జగన్ తన పత్రికలో రాయించుకున్నారని ఆనం గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తండ్రి మరణంపై ఒక్కసారి కూడా మాట్లాడలేదని, దర్యాప్తు కోసం ఒక్క ‘సిట్‌’ను కూడా ఏర్పాటు చేయలేదన్నారు. అంతేకాకుండా రిలయన్స్ అధినేత ఇంటికొచ్చి అడిగితే రాజ్యసభ సీటు కూడా ఇచ్చారని అన్నారు. 

అసలు జగన్ పత్రికకు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన చానల్‌కు కేంద్రం అనుమతులు ఎందుకు రద్దు చేసిందో కూడా చెప్పాలన్నారు. డిసెంబరు 2019లో స్థాపించిన ఆదాన్ డిస్టలరీ జగన్ సూట్‌కేసు కంపెనీ అని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
YSRCP
YSR
YS Jagan
YS Sharmila
Vijayalakshmi
TDP
Anam Ramanarayana Reddy

More Telugu News