Konda Surekha: ప్ర‌స్తుతం ఈ స్థాయిలో ఉన్నానంటే అది వైఎస్సార్ వల్లే: కొండా సురేఖ

  • కొండా చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో కొండా సురేఖ‌
  • విజ‌య‌వాడ‌లో వైఎస్సార్ విగ్ర‌హానికి నివాళి
  • వైఎస్ మ‌ర‌ణించాక ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను క‌ల‌వ‌లేద‌న్న సురేఖ‌
konda surekha comments on ys rajasekhar reddy and his family

ఉమ్మ‌డి రాష్ట్రానికి సీఎంగా ప‌నిచేసిన దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిపై కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డితో మాత్ర‌మే త‌న‌కు అనుబంధం ఉంద‌ని, ఆయ‌న మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను తాను ఎప్పుడూ క‌ల‌వ‌లేద‌ని ఆమె చెప్పారు. త‌న భ‌ర్త కొండా ముర‌ళి జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కిన కొండా చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సోమ‌వారం విజ‌య‌వాడకు వచ్చిన సురేఖ... న‌గ‌రంలోని వైఎస్సార్ విగ్ర‌హానికి నివాళి అర్పించారు. అనంత‌రం అక్క‌డే ఆమె మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడారు. 

ప్ర‌స్తుతం తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది వైఎస్సార్ వ‌ల్ల‌నేన‌ని కొండా సురేఖ అన్నారు. వైఎస్ ఆశ‌యాల‌కు అనుగుణంగానే రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్నాన‌ని ఆమె చెప్పారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఎలాంటి విలువ‌లు లేవ‌ని, డ‌బ్బే ప్ర‌ధానంగా రాజ‌కీయాలు మారిపోయాయ‌న్నారు. ఏ పార్టీ అయినా ప్ర‌జ‌ల అభివృద్ధి, సంక్షేమం కోస‌మే ప‌నిచేయాల‌ని ఆమె అన్నారు. ఏపీలో ఇప్పుడు వేరే ప్ర‌భుత్వం ఉంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. త‌న కుటుంబం కాంగ్రెస్ పార్టీలోనే ఉంద‌ని ఆమె చెప్పారు.

More Telugu News