Heinrich Klaasen: క్లాసెన్ వచ్చాడు... బాదాడు... రెండో టీ20లోనూ టీమిండియాకు తప్పని ఓటమి

  • కటక్ లో మ్యాచ్
  • మొదట బ్యాటింగ్ చేసిన భారత్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 148 రన్స్
  • 18.2 ఓవర్లలో ఛేదించిన సఫారీలు
  • 46 బంతుల్లో 81 పరుగులు చేసిన క్లాసెన్
  • సిరీస్ లో దక్షిణాఫ్రికాకు 2-0 ఆధిక్యం
Team India lost 2nd T20

దక్షిణాఫ్రికాతో రెండో టీ20లోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. కటక్ లో జరిగిన ఈ మ్యాచ్ లో అన్ని రంగాల్లో రాణించిన సఫారీలు 4 వికెట్లతో విజయం సాధించారు. తొలి టీ20లో టీమిండియా పాలిట డేవిడ్ మిల్లర్, వాన్ డర్ డుసెన్ విలన్లలా పరిణమిస్తే, ఈసారి ఆ పాత్రను వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ పోషించాడు. రెగ్యులర్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన క్లాసెన్ కేవలం 46 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టును గెలుపు ముంగిట నిలిపాడు. క్లాసెన్ స్కోరులో 7 ఫోర్లు, 5 భారీ సిక్సులున్నాయి. 

అంతకుముందు కెప్టెన్ టెంబా బవుమా 35 పరుగులు చేయగా, చివర్లో డేవిడ్ మిల్లర్ 20 (నాటౌట్) పరుగులు చేసి గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు. భారత్ విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా జట్టు 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు పడగొట్టగా, చహల్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జూన్ 14న విశాఖపట్నంలో జరగనుంది.

More Telugu News