Elephant: వృద్ధురాలిపై పగబట్టినట్టుగా వ్యవహరించిన ఏనుగు... భర్త ఆత్మ ఏనుగు రూపంలో వచ్చిందంటున్న స్థానికులు!

  • ఒడిశాలో దారుణం
  • ఏనుగు దాడిలో మరణించిన వృద్ధురాలు
  • చితిపై ఉండగా మరోసారి దాడి చేసిన ఏనుగు
  • ఏడేళ్ల కిందట వృద్ధురాలి భర్త మృతి
  • ఆమే భర్తకు విషం పెట్టి చంపిందని ప్రచారం
Elephant kills elderly woman in Odisha

ఒడిశాలో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన జరిగింది. ఓ వృద్ధురాలిని చంపిన ఏనుగు, ఆమె అంత్యక్రియల్లోనూ మరోసారి దాడి చేసింది. చితిపై ఉన్న వృద్ధురాలి మృతదేహాన్ని మరోసారి తొక్కి, లాగి విసిరివేసింది. దాంతో, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ వృద్ధురాలి భర్త ఆత్మ ఏనుగులో ప్రవేశించి కక్ష తీర్చుకుందని వారు అభిప్రాయపడుతున్నారు. 

అసలేం జరిగిందంటే.... మయూర్ భంజ్ జిల్లా రాయ్ పాల్ గ్రామంలో మాయా ముర్మూ (70) అనే వృద్ధురాలు మంచి నీటి కోసం పంపు వద్దకు వెళ్లింది. ఆ సమయంలో ఓ ఏనుగు ఆమెపై దాడి చేసింది. ఆసుపత్రికి తరలించినా ఆమె ప్రాణాలు దక్కలేదు. దాంతో, అదే రోజు సాయంత్రం బంధువులు ఆమె అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. ఆమెపై దాడి చేసిన ఆ ఏనుగు అంత్యక్రియలు జరిగే ప్రాంతానికి కూడా వచ్చింది. 

చితిపై ఉన్న వృద్ధురాలి శవాన్ని లాగేసి, మరోసారి కసిగా తొక్కింది. తొండంతో ఆ శవాన్ని విసిరిపారేసింది. అనంతరం అక్కడి నుంచి నిష్క్రమించింది. అయితే, ఆ ఏనుగులో ఉన్నది వృద్ధురాలి భర్త ఆత్మ అని అక్కడివారు నమ్ముతున్నారు. 

ఏడేళ్ల కిందట ఆ వృద్ధురాలి భర్త మరణించాడని, ఆ వృద్ధురాలే విషం పెట్టి చంపిందని ఓ ప్రచారం ఉంది. ఆమె భర్త ఇప్పుడు ఏనుగు రూపంలో వచ్చి పగ తీర్చుకున్నాడన్న వాదన బయల్దేరింది. ఆ వృద్ధురాలు చనిపోయి చితిపై ఉన్నా సరే ఆ ఏనుగు మరోసారి దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

More Telugu News