Bihar: బీహార్‌లో దారుణం.. కదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం

  • మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి అత్యాచారం
  • ఆపై బస్సులోనే బాలికను వదిలి లాక్ చేసి వెళ్లిపోయిన నిందితులు
  • డ్రైవర్, కండక్టర్, హెల్పర్ సహా నలుగురి అరెస్ట్
Minor girl gang raped inside bus in Bihar

బీహార్‌లోని చంపారన్ జిల్లాలో దారుణం జరిగింది. కదులుతున్న బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బస్సెక్కిన బాలికకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబందించి నిందితులైన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం.. ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరి బస్టాండ్‌లో 17 ఏళ్ల బాలిక బెట్టయ్య ప్రాంతానికి వెళ్లే బస్సు కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ బస్ డ్రైవర్ ఆమెను ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించాడు. బెట్టయ్యకు అని చెప్పడంతో తాము కూడా అటే వెళ్తున్నట్టు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాలిక బస్సెక్కెంది. 

తర్వాత కాసేపటికి ఆమెకు మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చారు. అది తాగిన ఆమె స్పృహ కోల్పోవడంతో బస్సులోని నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై బస్సును రోడ్డు పక్కన నిలిపి ఆమెను అందులోనే ఉంచి డోర్లు వేసి నిందితులు పరారయ్యారు. తనకు మెలకువ వచ్చిన తర్వాత చూస్తే డోర్లు వేసి ఉన్నాయని, అటుగా వెళ్తున్న వారు గుర్తించి తలుపులు తెరవడంతో తాను బయటపడ్డానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక పేర్కొంది.

బెట్టయ్యలోని ప్రభుత్వ ఆసుపత్రికి బాలికను తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. బస్సును సీజ్ చేశామని, ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల సాయం తీసుకుంటున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్ డ్రైవర్, కండక్టర్, హెల్పర్‌తోపాటు మరొకరిని అరెస్ట్ చేశారు.

More Telugu News