భారత రెస్టారెంట్ లో జానీ డెప్ డిన్నర్ పార్టీ.. రూ.49 లక్షల బిల్!
- బర్మింగ్ హామ్ లోని వారణాసి రెస్టారెంట్ లో పార్టీ
- తన బృందంతో కలసి విచ్చేసిన జానీ డెప్
- బటర్ చికెన్, పన్నీర్ టిక్కా, రైస్ కు ఆర్డర్
- 50 వేల పౌండ్లు బిల్లు చేసిన నటుడు
బ్రిటన్ పర్యటనలో ఉన్న జానీడెప్ తన బృందంతో కలసి జూన్ 5న బర్మింగ్ హామ్ లోని వారణాసి రెస్టారెంట్ కు వెళ్లాడు. బటర్ చికెన్, పన్నీర్ టిక్కా మసాలా, లాంబ్ కరాచి, కింగ్ ప్రావన్ భూన, రైస్ తదితర పదార్థాలను రుచి చూశారు. సాయంత్రం 7 గంటల సమయంలో రెస్టారెంట్ కు వచ్చిన వారు ముందు కాక్ టెయిల్ పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత భారత వంటకాల పని పట్టారు.
డిన్నర్ ముగిసిన తర్వాత 50,000 పౌండ్లను బిల్లుగా చెల్లించాడు. అంటే భారత కరెన్సీలో రూ.49 లక్షలు. వారణాసి రెస్టారెంట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మహమ్మద్ హుస్సేన్ దీనిపై స్పందిస్తూ.. ‘‘ఆదివారం మధ్యాహ్నం మాకు ఒక కాల్ వచ్చింది. డెప్ మా రెస్టారెంట్ కు రావాలనుకుంటున్నట్టు చెప్పారు. నేను షాక్ అయ్యాను. కానీ, అతడి సెక్యూరిటీ బృందం వచ్చి రెస్టారెంట్ ను చెక్ చేసింది. దీంతో డెప్ బృందానికి విశాలమైన ప్రదేశాన్ని విడిచి పెట్టాం’’ అని వివరించాడు. డెప్ తమ రెస్టారెంట్ కు విచ్చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారణాసి రెస్టారెంట్స్ తన varanasi.restaurants అనే ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ పెట్టింది.