2017 నాటి కేసులో జిగ్నేష్ మేవానీకి షరతులతో కూడిన బెయిల్

Court issues bail to Jignesh Mevani
  • 2017లో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని కేసు
  • బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ
  • అనుమతి లేకుండా గుజరాత్ ను వీడరాదన్న కోర్టు
  • పాస్ పోర్టులను కోర్టులో సమర్పించాలని ఆదేశం
గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి 2017 నాటి ఓ కేసులో బెయిల్ లభించింది. అయితే, కోర్టు అనుమతి లేనిదే గుజరాత్ ను వీడరాదని న్యాయస్థానం షరతు విధించింది. మేవానీతో పాటు మరో 10 మందికి కూడా ఈ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మేవానీ సహా వారందరూ తమ పాస్ పోర్టులను కోర్టులో అప్పగించాల్సిందిగా ఆదేశించింది. 

2017లో పోలీసుల అనుమతి లేకుండా ఓ ర్యాలీ నిర్వహించారన్న ఆరోపణలతో మేవానీ తదితరులపై కేసు నమోదైంది. ఈ కేసులో బెయిల్ పిటిషన్లపై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. 

కాగా, కోర్టు తమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం పట్ల జిగ్నేష్ మేవానీ స్పందించారు. కోర్టు నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. అయితే కేంద్రం తనను ఇబ్బంది పెట్టేందుకు ఏ అవకాశాన్నీ వదలడంలేదన్న విషయం మరోసారి స్పష్టమైందని వ్యాఖ్యానించారు. 

తాను ఓ నాయకుడ్నని, దేశవ్యాప్తంగా ప్రజలు తనను స్వాగతిస్తున్నారని తెలిపారు. ఇటీవలే కేరళలో ఓ ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారం చేశానని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తనకు ఆదరణ పెరుగుతుండడం పట్ల బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. అందుకే తనను వేధించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోందని అన్నారు.
Go Back to Shorts
Jignesh Mevani
Bail
Court
Gujarat

More Telugu News