Rajasthan Royals: ఐపీఎల్ శ్రీమంతుడు బట్లర్.. అవార్డుల ద్వారా కళ్లు చెదిరే సంపాదన!

  • 37 అవార్డుల ద్వారా రూ. 95 లక్షలు అందుకున్న జోస్ బట్లర్
  • ఆరు ప్రధాన అవార్డుల ద్వారా రూ. 60 లక్షల ఆర్జన
  • ఫెర్గ్యూసన్, ఉమ్రాన్‌ మాలిక్, యుజ్వేంద్ర చాహల్, ఎవిన్ లూయిస్‌లకు చెరో రూ. 10 లక్షల ప్రైజ్ మనీ
RR opener Jos Buttler earned Rs 95 Lakh through awards in IPL 2022

ఐపీఎల్‌ 2022లో బ్యాట్‌తో వీరంగమేసిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సంపాదనలోనూ అదరగొట్టాడు. మొత్తంగా 37 అవార్డుల ద్వారా  ఏకంగా రూ. 95 లక్షలు సొంతం చేసుకున్నాడు. నాలుగు సెంచరీలతో 863 పరుగులు చేసిన ఈ ఇంగ్లిష్ క్రికెటర్ మొత్తంగా 863 పరుగులతో ఆరెంజ్ క్యాప్ అవార్డుతోపాటు అత్యధిక సిక్సర్లు (45), అత్యధిక ఫోర్లు (83), గేమ్ చేంజర్ ఆఫ్ ద సీజన్, ప్లేయర్ ఆఫ్ ద సీజన్, అత్యంత విలువైన ఆటగాడి అవార్డులు అందుకున్నాడు.

ఈ ఆరు అవార్డులకు గాను ఒక్కో దానికి రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 60 లక్షలు అందుకున్నాడు. ఇవి కాక లీగ్ మ్యాచుల్లో లభించిన ఒక్కో అవార్డుకు లక్ష రూపాయల చొప్పున అందుకున్నాడు. వెరసి మొత్తంగా 37 అవార్డుల ద్వారా ఏకంగా రూ. 95 లక్షలు ఆర్జించాడు. కాగా, వేలంలో రాజస్థాన్ రాయల్స్ బట్లర్‌ను రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. 

మరోపక్క, గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ లాకీ ఫెర్గ్యూసన్ ఫైనల్‌లో 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ఈ సీజన్‌లోనే అత్యంత వేగవంతమైన డెలివరీ సంధించాడు. ఇందుకు గాను అతడికి రూ. 10 లక్షల ప్రైజ్‌మనీ లభించింది. ఈ సీజన్‌లో ఎమర్జింగ్ ప్లేయర్‌ అవార్డు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ (22) రూ. 10 లక్షలు అందుకున్నాడు. 

ఇక అత్యధిక వికెట్లు నేలకూల్చిన యుజ్వేంద్ర చాహల్, ‘బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్’ అవార్డు అందుకున్న ఎవిన్ లూయిస్ చెరో రూ. 10 లక్షలు పొందారు. అలాగే, ఐపీఎల్ రన్నరప్‌ అయిన రాజస్థాన్ రాయల్స్ రూ. 12.5 కోట్లు అందుకోగా, చాంపియన్ గుజరాత్ జట్టు రూ. 20 కోట్లు అందుకుంది.

More Telugu News