Edava Basheer: పాట పాడుతూ వేదికపై కుప్పకూలి మరణించిన ప్రముఖ మలయాళ గాయకుడు... వీడియో ఇదిగో!

  • అలప్పుళలో ఘటన
  • శనివారం రాత్రి సంగీత విభావరిలో పాల్గొన్న బషీర్
  • హిందీ పాట పాడుతూ నేలకొరిగిన వైనం
  • సంతాపం తెలిపిన సీఎం పినరయి విజయన్
Kerala singer Edava Basheer collapsed on stage and died

మలయాళ సినీ, సంగీత రంగాలు విషాదంలో మునిగిపోయాయి. ప్రముఖ గాయకుడు ఇడవ బషీర్ (78) హఠాన్మరణం చెందారు. వేదికపై పాట పాడుతూ కుప్పకూలిన బషీర్ తుదిశ్వాస విడిచారు. అలప్పుళ ప్రాంతంలో ఓ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ప్రముఖ మ్యూజిక్ ట్రూప్ భీమాస్ బ్లూ డైమండ్ ఆర్కెస్ట్రా 50వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విభావరిలో ప్రముఖ సినీ గాయకుడు ఇడవ బషీర్ కూడా పాల్గొన్నారు. 

ఆయన హిందీ పాట 'మానో హో తుమ్' ఆలపిస్తూ ఒక్కసారిగా నేలకొరిగారు. కార్యక్రమ నిర్వాహకులు బషీర్ ను హుటాహుటీన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆయన అప్పటికే మరణించారు. ఇడవ బషీర్ మరణం పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ప్రముఖ గాయని చిత్ర కూడా బషీర్ ఆకస్మిక మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. కాగా, బషీర్ అంత్యక్రియలు నిన్న నిర్వహించారు.

More Telugu News