తిరుపతి శివార్లలో సూట్ కేసులో వివాహిత శవం.... భర్తే హంతకుడు!

Tirupathi police solves married woman murder case
  • వేణుగోపాల్, పద్మావతి భార్యాభర్తలు
  • కాపురంలో తలెత్తిన కలతలు
  • ఓసారి కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
  • ఏమాత్రం మారని కలహాల కాపురం
  • పుట్టింటికి వెళ్లిపోయిన పద్మావతి
  • పక్కా ప్లాన్ తో భార్యను చంపేసిన వేణుగోపాల్
ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కట్టుకున్న భార్యను కడతేర్చి ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. తిరుపతికి చెందిన వేణుగోపాల్, పద్మావతి భార్యాభర్తలు. వీరికి 2009లో పెళ్లయింది. కాపురంలో గొడవలు రావడంతో ఓసారి పోలీసులు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ గొడవ పడుతుండేవారు. దాంతో, పద్మావతి పుట్టింటికి వెళ్లిపోయింది. వేణుగోపాల్ అత్తగారింటికి వెళ్లి, అక్కడివారికి నచ్చజెప్పి భార్యను తనతో పాటు తీసుకొచ్చాడు. 

కానీ అతడి మనసులో క్రూర పన్నాగం ఉందని పద్మావతి గుర్తించలేకపోయింది. ఈ నేపథ్యంలో, గత జనవరి నెలలో పద్మావతిని హత్య చేసిన భర్త వేణుగోపాల్ శవాన్ని ఓ సూట్ కేసులో కుక్కి తిరుపతి శివార్లలోని వెంకటాపురం చెరువులో పడేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయాడు. పద్మావతి కూడా తనతోనే ఉందని అత్తమామలతో నమ్మబలికాడు. 

అయితే, గత ఐదు నెలలుగా తమ కుమార్తెతో ఫోన్ లో మాట్లాడనివ్వకపోవడంతో పద్మావతి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దాంతో వారు తిరుపతి (ఈస్ట్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, పోలీసులు హైదరాబాద్ నుంచి వేణుగోపాల్ ను రప్పించి, విచారణ చేయడంతో హత్య విషయం వెల్లడైంది. 

వెంకటాపురం చెరువులో కుళ్లిన స్థితిలో ఉన్న పద్మావతి మృతదేహాన్ని వెలికితీశారు. వేణుగోపాల్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ఆరంభించారు. కాగా, పద్మావతి దారుణ రీతిలో భర్త చేతిలోనే హత్యకు గురైందని తెలిసి ఆమె తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Go Back to Shorts
Woman
Murder
Husband
Police
Tirupati

More Telugu News