Balakrishna: ఇప్పుడున్న ప్రభుత్వం గుడితో పాటు గుళ్లో లింగాన్ని కూడా మింగేసే రకం: ఒంగోలులో బాలకృష్ణ

  • ఒంగోలులో టీడీపీ మహానాడు
  • ముగింపు సందర్భంగా భారీ సభ ఏర్పాటు
  • హాజరైన బాలకృష్ణ
  • ఎన్టీఆర్ ను శక పురుషుడిగా పేర్కొన్న వైనం
  • చంద్రబాబుపై ప్రశంసలు
Balakrishna slams YCP Govt in his speech at Ongole

నందమూరి తారక రామారావు తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ మహానాడుకు హాజరయ్యారు. నిన్నటి నుంచి తన తండ్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, కార్యక్రమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ నేడు ఒంగోలులో జరుగుతున్న పార్టీ మహానాడు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభలో ఆయన ప్రసంగించారు. నందమూరి తారక రామారావు శక పురుషుడు అని అభివర్ణించారు. ఇవాళ ఆయన శత జయంతిని జరుపుకుంటున్నామని తెలిపారు. 

"ఈ భూమ్మీద అందరూ పుడతారు గిడతారు.. కానీ అందరూ మహానుభావులు కాలేరు. ఒక వ్యక్తి మహోన్నత పథంలోకి నడవాలంటే, ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే సత్సంకల్పం కావాలి. అకుంఠిత దీక్ష పూనాలి. నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్న గారు నాకెప్పుడూ చెబుతుండేవారు. ఆయన ఈ మాటలు చెప్పడమే కాదు.... ఎటువంటి వ్యతిరేక పరిస్థితుల్లోనూ తలవంచక, అదరక బెదరక ముందుకు సాగిన ధీరోదాత్తుడు. 

తెలుగుజాతి వెలుగును ప్రపంచం నలుమూలలా ప్రసరింపజేసిన తెలుగువెలుగు నందమూరి తారక రామారావు. ఆయన మహానుభావుడు కాబట్టి ఆయనకు పంచభూతాలు, అష్టదిక్పాలకులు అందరూ సహకరించి, అన్ని పరిస్థితులు అనుకూలించి ఒక మహత్తరమైన సమయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సినీ రంగంలో ప్రవేశించి మహోజ్వలంగా ప్రకాశించారు. ఢిల్లీలో తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న పరిస్థితుల్లో నేనున్నాంటూ ఎలుగెత్తిన మహనీయుడు నందమూరి తారకరామారావు.

నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి ప్రజారంజక పాలన సాగించారు. కానీ ఇప్పుడు రాష్ట్రం ఎలా ఉందో చూస్తున్నాం. అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి... విద్యుత్ చార్జీలు ఈ మూడేళ్లలో ఏడు సార్లు పెంచారు. చెత్తపై పన్ను వేశారు, ఆస్తి పన్ను భారంగా మార్చారు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచారు, మరుగుదొడ్ల పన్ను వేశారు. దేశమంటే మనుషులోయ్ అని గురజాడ వారు అన్నారు. కానీ ఈ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా దేశమంటే మట్టి అంటూ అధికారం చెలాయిస్తోంది" అంటూ విమర్శలు చేశారు. 

ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ప్రశంసలు కురిపించారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు ఐటీ ఫలాలను మన యువతకు అందించిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. డ్వాక్రా సంఘాలతో మహిళలకు స్వయంశక్తి దిశగా ఉపాధి కల్పించారని కీర్తించారు. అంతేకాకుండా, రాష్ట్రానికి బిల్ క్లింటన్ వంటి ప్రముఖులను కూడా తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. 

ఇప్పుడున్న ప్రభుత్వం గుడితో పాటు గుళ్లో లింగాన్ని కూడా మింగేసే రకం అని, ఓటు విషయంలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. "ఓటు అంటే నోటు కాదని తెలుసుకో, ఓటుతోనే రాజకీయం ఉంది ముడిపడి, ఓటు వృథా చేయకు త్వరపడి" అంటూ బాలయ్య ఓటు ప్రాశస్త్యాన్ని కవితాత్మకంగా చెప్పారు.

More Telugu News