Atchannaidu: చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్క సంతకంతో టీడీపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కేసులు, రౌడీ షీట్లు ఎత్తేస్తారు: అచ్చెన్నాయుడు
- చంద్రబాబును సీఎం చేసేందుకు ప్రతి కార్యకర్త కదం తొక్కాలన్న అచ్చెన్న
- 160 సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారంటూ వ్యాఖ్య
- టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారి తాట తీసేలా చంద్రబాబు పాలన ఉంటుందన్న అచ్చెన్న
ఒంగోలులో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందని, టీడీపీ పుట్టి 40 ఏళ్లు పూర్తయిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ఏడాది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ శత జయంతి కూడా కావడం వల్ల ఈ మహానాడు చాలా ప్రత్యేకమైనదని అన్నారు. తమ అధినేత చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త కదం తొక్కాలని పిలుపునిచ్చారు. టీడీపీ అంటే కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాజకీయం చేసే పార్టీ కాదని... అధికారం లేకపోయినా ప్రజల మధ్య ఉండే పార్టీ అని చెప్పారు.