Karnataka: పెళ్లికి నిరాకరించిన పెద్దలు.. కారుకు నిప్పంటించుకుని ప్రేమజంట ఆత్మహత్య

  • కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఘటన
  • ఒక్కటయ్యే మార్గం కనిపించకపోవడంతో కలిసి ఆత్మహత్య
  • ఆత్మహత్యకు ముందు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపిన ప్రేమికులు
  • వారు అప్రమత్తమయ్యే లోపే ఘోరం
Young Couple Found Charred to Death in Car in Udupi

పెద్దలు తమ ప్రేమను వ్యతిరేకించడంతో విరక్తి చెందిన ఓ ప్రేమ జంట తాము ప్రయాణిస్తున్న కారుకు నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో జరిగిందీ ఘటన. బెంగళూరుకు చెందిన యశ్వంత్-జ్యోతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి ప్రేమకు ఇరు కుటుంబాల వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఒక్కటయ్యే మార్గం కనిపించలేదు.

ఈ క్రమంలో భాగంగా శనివారం రాత్రి ఇద్దరూ మంగళూరు చేరుకున్నారు. అక్కడ ఓ కారును అద్దెకు తీసుకుని ఉడుపి వైపుగా బయలుదేరారు. అప్పటికే ఆత్మహత్య చేసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చిన వారు తాము చనిపోతున్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు అప్రమత్తమయ్యేలోపే ఘోరం జరిగిపోయింది. 

ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఉడుపి జిల్లా బహ్మార్వ తాలూకా హెగ్గుంజె సమీపంలో కారుపై పెట్రోలు పోసి లోపల కూర్చుని నిప్పంటించుకున్నారు. గమనించిన స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే లోపలున్న యశ్వంత్-జ్యోతి అగ్నికి ఆహుతయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News