Gorantla Butchaiah Chowdary: చంద్రబాబును అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • కక్ష సాధింపులే లక్ష్యంగా వైసీపీ పాలన కొనసాగుతోందన్న బుచ్చయ్య 
  • దమ్ముంటే చంద్రబాబును అరెస్ట్ చేయమని సవాల్ 
  • వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య 
Gorantala Butchaiah Chowdary gives warning to YSRCP

అమరావతి ల్యాండ్ పూలింగ్ వ్యవహారంలో ఏపీ సీఐడీ తాజాగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ లో ఏ1గా చంద్రబాబును, ఏ2గా మాజీ మంత్రి నారాయణను పోలీసులు చేర్చారు. మరోవైపు అవసరమైతే చంద్రబాబును కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 

రాష్ట్రంలో పాశవిక పాలన కొనసాగుతోందని అన్నారు. కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్ పాలన ఉందని విమర్శించారు. కక్ష సాధింపుల్లో భాగంగానే చంద్రబాబు, నారాయణలపై కేసులు నమోదు చేశారని అన్నారు. తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు ఎంతో కాలం నిలబడవని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ నేతలకు దమ్ముంటే చంద్రబాబును అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

నవరత్నాలు అనేవి పెద్ద బోగస్ అని బుచ్చయ్యచౌదరి అన్నారు. గడప గడపకు వెళ్లడానికి వైసీపీ నేతలు భయపడుతున్నారని చెప్పారు. తమ ఇంటి వద్దకు వస్తున్న వైసీపీ నేతలను ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. టీడీపీ పొత్తులను చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

More Telugu News