Supreme Court: దేశద్రోహ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు... విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు

  • దేశద్రోహ చట్టం దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణలు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన పలువురు వ్యక్తులు
  • కేంద్రం పునరాలోచన చేస్తోందన్న సొలిసిటర్ జనరల్
  • విచారణ వాయిదా వేయాలని కోర్టుకు విన్నపం
Supreme Court hearing on petitions that challenges treason act

దేశద్రోహ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవడం తెలిసిందే. ఈ పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. చట్టం అమలుపై కేంద్రం పునరాలోచన చేస్తోందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. కేసు విచారణను వాయిదా వేయాలని కోరారు. 

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ స్పందిస్తూ, తుది నిర్ణయానికి ఎంత సమయం తీసుకుంటారని కేంద్రాన్ని ప్రశ్నించారు. చట్టం దుర్వినియోగంపై ఆందోళనలు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ చెప్పారని సీజేఐ పేర్కొన్నారు. హనుమాన్ చాలీసా పఠనం వల్లే ఈ కేసులు తెరపైకి వస్తున్నాయన్న వాదనలు కూడా ఉన్నాయని వివరించారు. 

జస్టిస్ హిమా కోహ్లీ స్పందిస్తూ, దేశద్రోహ చట్టాన్ని కేంద్రం పునఃపరిశీలించాలని స్పష్టం చేశారు. కేంద్రం 3-4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కేసు విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది.

More Telugu News