KRMB: ముగిసిన కేఆర్ఎంబీ సమావేశం... నీటి పంపకాలపై వాడివేడి చర్చ

  • నీటి వాటాలే ప్రధాన అజెండా
  • 16 అంశాలపై చర్చ జరిగిందన్న శశిభూషణ్
  • ఈసారి కూడా 66:34 నిష్పత్తిలోనే నీటి పంపిణీ అని వెల్లడి
  • తమకు ఆమోదయోగ్యం కాదన్న రజత్ కుమార్
  • తెలంగాణ విజ్ఞప్తిని తోసిపుచ్చిన కేఆర్ఎంబీ
KRMB meeting concluded

తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాల పంపిణీపై స్పష్టత కోసం ఉద్దేశించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. దీనిపై ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సమావేశంలో 16 అంశాలపై విస్తృత చర్చ జరిగిందని వెల్లడించారు. ఈ ఏడాది కృష్ణా జలాల పంపిణీలో 66:34 నిష్పత్తి ఉంటుందని స్పష్టం చేశారు. 

శ్రీశైలం, సాగర్ లో తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేసిందని శశిభూషణ్ కుమార్ ఆరోపించారు. అక్రమ విద్యుత్ ఉత్పత్తితో కృష్ణా జలాలను వృథా చేసిందని తెలిపారు. నిర్వహణ లోపం వల్లే శ్రీశైలంలో 5 టీఎంసీలకు మించి నీరు లేకుండా పోయిందని వెల్లడించారు. శ్రీశైలం నుంచి తాగునీటికి కూడా సమస్య ఉందని అన్నారు. విద్యుదుత్పత్తిపై ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు తెలిపారు. కమిటీ 15 రోజుల్లో ప్రోటోకాల్స్ రూపొందించాల్సి ఉంటుందని వివరించారు. 

డ్యాంల భద్రత పైనా ఈ సమావేశంలో చర్చించామని శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. 10 ప్రాజెక్టుల డీపీఆర్ లను ఏపీ సమర్పించాల్సి ఉందని వివరణ ఇచ్చారు. 20 రోజుల్లో డీపీఆర్ లు, ప్రాజెక్టుల స్టేటస్ ఇస్తామని చెప్పామని తెలిపారు. ప్రాజెక్టులను బోర్డుకు ఇచ్చే ముందు రూల్ కర్వ్స్ పై చర్చించామని అన్నారు. నెలలోగా రూల్ కర్వ్స్ ఖరారుకు ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ కమిటీ నెలలోగా నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

కాగా, ప్రతిపాదిత 66:34 నిష్పత్తిలో నీటి పంపిణీకి తాము అంగీకరించబోమని తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ పేర్కొనడం తెలిసిందే. 66:34 నిష్పత్తిని ఒక్క సంవత్సరానికే వర్తింప చేసేలా గతేడాది అంగీకరించామని, ఈసారి 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ చేయాల్సిందేనని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

More Telugu News