Uttar Pradesh: సామూహిక అత్యాచారానికి గురైన బాలికపై యూపీ పోలీసు అధికారి దాష్టీకం.. వాంగ్మూలం కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిపించి అత్యాచారం!

  • బాలికకు మాయమాటలు చెప్పి భోపాల్ తీసుకెళ్లిన నిందితులు
  • అక్కడ ఆమెపై మూడు రోజులపాటు సామూహిక అత్యాచారం
  • విషయం వెలుగు చూడడంతో పరారైన పోలీస్ ఇన్‌స్పెక్టర్
  • అలహాబాద్‌లో పట్టుకున్న పోలీసులు
  • మానవహక్కుల సంఘం సీరియస్
  • యూపీ ప్రభుత్వానికి, డీజీపీకి నోటీసులు
UP Cop Who Allegedly Raped 13 Year Old Rape Survivor Arrested in Allahabad

సామూహిక అత్యాచారానికి గురైన 13 ఏళ్ల బాలికను వాంగ్మూలం కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఓ ఇన్‌స్పెక్టర్ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో గత నెలాఖరులో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికకు కౌన్సెలింగ్ ఇస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది. 

లలిత్‌పూర్ ఎస్పీ నిఖిల్ పాఠక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. లలిత్‌పూర్ జిల్లాలోని పాళి పట్టణానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన చందన్, రాజ్‌భాన్, హరిశంకర్, మమేంద్ర చౌరాసియాలు గత నెల 22న బాధిత బాలికకు మాయమాటలు చెప్పి భోపాల్ తీసుకెళ్లి మూడు రోజులపాటు అత్యాచారం చేశారు. అనంతరం 26న ఆమెను పాళి పోలీస్ స్టేషన్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. బాలికను గమనించిన పోలీసులు బాధితురాలిని ఆమె పిన్నికి అప్పగించారు. 

ఆ తర్వాతి రోజు (27న) బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. బాలికను తీసుకుని ఆమె పిన్ని పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆమెను బయటే ఉంచిన ఇన్‌స్పెక్టర్ తిలక్‌ధారి సరోజ్ వాంగ్మూలం పేరుతో బాలికను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అయితే, బయట ఉన్న ఆమె పిన్నికి గానీ, ఆమె తల్లిదండ్రులకు గానీ ఈ విషయం తెలియదు. గత నెల 30న బాలికను పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన చైల్డ్‌లైన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో తనపై జరిగిన దారుణాన్ని బాలిక వెల్లడించింది. దీంతో ఆమెపై దారుణానికి ఒడిగట్టిన నలుగురు యువకులతోపాటు ఇన్‌స్పెక్టర్‌పైనా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

విషయం వెలుగు చూడడంతో పరారైన ఇన్‌స్పెక్టర్‌ను అలహాబాద్ హైకోర్టు సమీపంలో పట్టుకున్నారు. మిగతా నలుగురు నిందితులు కూడా పోలీసులకు చిక్కారు. అలాగే, బాలికపై దారుణం జరిగిన పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని విధుల నుంచి తప్పించి, శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

మరోపక్క, వాంగ్మూలానికి పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసే అత్యాచారానికి పాల్పడిన ఘటనను జాతీయ మానవహక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, యూపీ డీజీపీకి నోటీసులు జారీ చేసింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ నిన్న బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించారు.

More Telugu News